Ex Minister Koppula | గత పదేండ్లలో కేసీఆర్ పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని బీఆర్ఎస్ పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ అభ్యర్థి, మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. కాళేశ్వరం అంటే కేసీఆర్.. కేసీఆర్ అంటే కాళేశ్వరం.. కానీ కాళేశ్వరం ప్రాజెక్టును కాంగ్రెస్ పార్టీ కావాలని బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నదని ఆరోపించారు. త్వరలో లోక్సభ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో సోమవారం పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తల సన్నాహక సమావేశంలో కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఒక్క ఎకరానికి నీళ్లు రాలేదన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి.. ఇప్పుడు ఆ ప్రాజెక్టులో నీళ్ళు ఎందుకు లేవో సమాధానం చెప్పాలన్నారు.
భారీ వర్షాలతో పోటెత్తిన వరదల వల్ల కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక పిల్లర్ కుంగిపోతే, కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం కూలిపోయిందని అసత్య ప్రచారం చేస్తున్నారని కొప్పుల ఈశ్వర్ మండి పడ్డారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పంటల కోతల కాలంలో నీళ్లు ఆపమని రైతులు చెప్పారని, కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పంటలకు నీళ్లందక రైతులు గోస పడుతున్నారని, మూడు నెలల్లోనే ఇంత మార్పా అని ప్రశ్నించారు.
అధికారం శాశ్వతం కాదని, ఎన్నికల్లో గెలుపొటములు సహజం అని కొప్పుల ఈశ్వర్ అన్నారు. కానీ బీఆర్ఎస్ స్కామ్లు చేసిన పార్టీ కాదన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి, దేశమే భేష్ అనిపించుకున్న రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. వికలాంగులు, వృద్దులు, ఒంటరి మహిళలతోపాటు వివిధ వర్గాలకు సంక్షేమ పథకాలు అందించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పాలన, వారు ఇచ్చిన ఆచరణకు అమలు కాని పథకాలపై ప్రజలకు అవగాహన కలిగిందని, ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీకి భంగపాటు తప్పదన్నారు.
గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ కి ఓటు అడిగిన కాంగ్రెస్ నాయకులను ప్రశ్నించే పరిస్థితి ముందు ముందు మనమే చూస్తామని కొప్పుల ఈశ్వర్ చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పథకాలకు మంజూరైన నిధులను కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పూర్తిగా రద్దు చేసిందని, ఇది మంచి సంప్రదాయం కాదన్నారు. ఈ సమావేశంలో జగిత్యాల జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు విద్యాసాగర్ రావు, జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ తదితరులు పాల్గొన్నారు.