హైదరాబాద్, జనవరి 4 (నమస్తే తెలంగాణ)/సుల్తాన్బజార్: ఎనిమిదేండ్లలో వ్యవసాయరంగం సాధించిన ప్రగతి తెలంగాణకు గర్వకారణమని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో వ్యవసాయ వృద్ధి రేటు 3 శాతమే ఉంటే.. తెలంగాణ వ్యవసాయ వృద్ధి రేటు 10% ఉన్నదని చెప్పారు. ఈ విషయాన్ని నీతి ఆయోగ్ వెల్లడించిందని గుర్తుచేశారు. నాడు ఆకలిచావులు, ఆత్మహత్యలు, అంబలి కేంద్రాలతో కునారిల్లిన తెలంగాణ.. నేడు పొరుగు రాష్ర్టాలకు బియ్యం సరఫరా చేసే స్థాయికి ఎదిగిందని పేర్కొన్నారు. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సాధ్యమైందని స్పష్టంచేశారు.
బుధవారం అబిడ్స్లోని రెడ్డి హాస్టల్లో తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం రూపొందించిన వ్యవసాయ డైరీ, క్యాలెండర్ను వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డితో కలిసి హరీశ్రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ చేపట్టిన కార్యక్రమాలతో వ్యవసాయ ఉత్పత్తులు పెరిగాయని, వరి ఉత్పత్తిలో దేశంలోనే రెండో స్థానంలో నిలిచిందని వివరించారు. వ్యవసాయశాఖలో ఉద్యోగులకు పదోన్నతులు కల్పిస్తామని, ఉద్యోగ సంఘాలు పట్టుదలకు పోకుండా ప్రభుత్వ నిబంధనల ప్రకారం పదోన్నతులకు సిద్ధమై వస్తే.. వారంలో ఆ ప్రక్రియను పూర్తిచేసే బాధ్యత తమదేనని స్పష్టం చేశారు.
యువతను వ్యవసాయం వైపు ఆకర్షించాలి: నిరంజన్రెడ్డి
ఉన్నత చదువులు చదివిన యువతను వ్యవసాయం వైపు ఆకర్షించేందుకు వ్యవసాయశాఖ అధికారులు కృషిచేయాలని సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సూచించారు. రైతులను ఉద్యాన పంటల వైపు మళ్లించాలని, ఆయిల్పామ్ సాగును ప్రోత్సహించాలని కోరారు. బీటెక్ చదివిన యువత తమ ఉద్యోగాలను వదిలేసి, వ్యవసాయం వైపు వస్తుండటం మంచి పరిణామమని అన్నారు. ఎకరా పొలంలో రూ.10 లక్షల దిగుబడి సాధిస్తామన్న ధీమా, ఆత్మవిశ్వాసం యువతలో కల్పించాలని పిలుపునిచ్చారు. ప్రపంచ జనాభా 800 కోట్లు దాటిపోతున్న నేపథ్యంలో ఆహార కొరత రాకుండా భూ సంరక్షణ, భూసారం పెంపుపై వ్యవసాయాధికారులు దృష్టిసారించాలని సూచించారు.
రాష్ట్రంలో ఐదెకరాలలోపు ఉన్న రైతులు 92.5% ఉన్నారని, వీరంతా సమీకృత వ్యవసాయాన్ని చేపట్టేలా వ్యవసాయాధికారులు కృషిచేయాలని సూచించారు. వ్యవసాయశాఖ ఉద్యోగుల సమస్యలన్నీ పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. నూతన క్లస్టర్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం, తెలంగాణ రిటైర్డ్ వ్యవసాయ అధికారుల సంఘం ప్రతినిధులు క్షేత్రస్థాయిలో తమకు ఎదురవుతున్న సమస్యలను వివరించగా, వాటి పరిష్కారానికి మంత్రులు సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ అధికారుల సంఘం చైర్మన్ బీ కృపాకర్రెడ్డి, అధ్యక్షురాలు కే అనూరాధ, ప్రధాన కార్యదర్శి జీ కృపాకర్రెడ్డి, కోశాధికారి విజయ్కుమార్, జాయింట్ సెక్రటరీ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
సంపూర్ణంగా మారిన సాగు స్వరూపం
రాష్ట్రంలో ఎనిమిదేండ్లలో వ్యవసాయరంగ స్వరూపం సంపూర్ణంగా మారిపోయిందని హరీశ్రావు వివరించారు. ధాన్యం ఉత్పత్తి 68 లక్షల టన్నుల నుంచి 2.49 కోట్ల టన్నులకు పెరిగిందని గుర్తుచేశారు. దిగుబడి పెరిగిన తెలంగాణ ధాన్యం కొనాలని అడిగితే.. క్యా చమత్కార్ కరే అంటూ కేంద్రమంత్రి పీయూష్గోయల్ ఎద్దేవా చేశారని.. అది చమత్కారం కాదు కేసీఆర్ కృషి అని హరీశ్రావు స్పష్టంచేశారు. గతంలో వ్యవసాయం దండుగ అన్న వ్యక్తి కూడా ఇప్పుడు ఇంకా ఏదో చేయాలని అంటున్నాడని చురకలేశారు. అర్ధరాత్రి కరెంటుతో రైతుల ఉసురుపోసుకున్న పార్టీ కూడా వ్యవసాయం గురించి మాట్లాడుతున్నదని ఎద్దేవా చేశారు.
నల్లచట్టాలతో రైతుల ఉసురు పోసుకున్న పార్టీ తెలంగాణ రైతులు వ్యవసాయ కల్లాలు నిర్మించుకుంటే ఆ పైసలు వెనక్కి ఇవ్వాలని అడుగుతున్నదని మండిపడ్డారు. బోరుబావులకు మీటర్లు పెట్టడం లేదని కేంద్రం రూ.30 వేల కోట్లను రాష్ర్టానికి రాకుండా నిలిపివేసిందని తెలిపారు. ఎఫ్ఆర్బీఎం నుంచి రూ.15 వేల కోట్లు కోత పెట్టిందని వివరించారు. కార్పొరేట్ల అప్పులు తప్ప కర్షకుల అప్పులను కేంద్రం ఎందుకు మాఫీచేయడం లేదని ప్రశ్నించారు. రైతుల పట్ల, వ్యవసాయం పట్ల బీఆర్ఎస్ చిత్తశుద్ధిని ప్రశ్నించే అర్హత ఎవరికీ లేదని స్పష్టంచేశారు.