హైదరాబాద్, జనవరి 24(నమస్తే తెలంగాణ): తెలంగాణలో అమలవుతున్న వ్యవసాయ పథకాలపై కర్ణాటక, కేరళ, తమిళనాడు రైతు సంఘాల నేతలు ప్రశంసలు కురిపించారు. ఈ పథకాలు అద్భుతంగా ఉన్నాయని, ఇవి దేశవ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరం ఉన్నదని ఆకాంక్షించారు. మంగళవారం హైదరాబాద్లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో మూడు రాష్ర్టాల రైతు సంఘాల నేతలు భేటీ అయ్యారు. రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న కేసీఆర్ నాయకత్వంలో పని చేసేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారు. తమ రాష్ట్రాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను కవిత దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రైతు సంఘాల నేతలు మాట్లాడుతూ.. రైతు బీమా, రైతుబంధు వంటి పథకాలు అమలుచేస్తున్న సీఎం కేసీఆర్ను రైతు పక్షపాతిగా అభివర్ణించారు.
దేశంలో మరే రాష్ట్రంలోనూ లేనివిధంగా తెలంగాణ రైతులకు వేల కోట్ల ఖర్చుతో రైతుబంధు, రైతుబీమా, 24 గంటల ఉచిత విద్యుత్తు పథకాలను అమలు చేయడం గొప్ప విషయమని అన్నారు. సీఎం కేసీఆర్ పాలనలో రైతులు సంతోషంగా ఉన్నారని, ఇతర రాష్ట్రాల రైతులు కూడా కేసీఆర్ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయాలు, చేపడుతున్న పనులు దేశానికి స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని కొనియాడారు. కేసీఆర్ నాయకత్వంలో ‘అబ్ కీ బార్ కిసాన్ సరార్’ నినాదంతో దేశంలో సమగ్ర మార్పు సాధ్యమని తెలిపారు. సమావేశంలో కేరళ నుంచి అరి వకాగన్, సౌందర్య పాండియన్, మురిగేశన్, బాలసుబ్రహ్మణ్యం, కర్ణాటక నుంచి జీఎస్ రవీందర్, రవిప్రకాశ్, తమిళనాడు నుంచి చంద్రన్, ధనుశేఖర్ తదితర రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు.