హైదరాబాద్, మే 27 (నమస్తే తెలంగాణ): కల్తీలేని నాణ్యమైన ఉత్పత్తులకు విజయ బ్రాండ్ నూనెలు కేరాఫ్ అని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. విజయ ఉత్పత్తులను ఆదరించి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని వినియోగదారులకు సూచించారు. శనివారం హైదరాబాద్లోని మంత్రుల నివాస సముదాయంలో విజయ బ్రాండ్ వేరుశెనగ గానుగ నూనెను మార్కెట్లోకి విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వినియోగదారులకు కల్తీలేని ఉత్పత్తులను అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఆయిల్ఫెడ్ నుంచి నాణ్యమైన వంటనూనెలు అందుబాటులోకి వచ్చాయని వివరించారు.
ఇప్పటికే వేరుశెనగ, పొద్దుతిరుగుడు, నువ్వులు, కొబ్బరి, రైస్ బ్రాన్, పామాయిల్ నూనెలు ఉత్పత్తి చేస్తున్న ఆయిల్ ఫెడ్, తాజాగా వేరుశనగ గానుగ నూనెను కూడా అందుబాటులోకి తీసుకొచ్చిందని తెలిపారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఆయిల్ఫెడ్ ఔట్లెట్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని, ఇప్పటికే హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్లో అందుబాటులో ఉండగా, సిద్దిపేట, వనపర్తిలో జూన్లో ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. అయిల్ఫెడ్ ఏటా వెయ్యి కోట్ల టర్నోవర్తో రూ.100 కోట్ల లాభాలను ఆర్జిస్తున్నదని, ఇందులో కేవలం నూనె ఉత్పత్తులపైనే రూ.10 కోట్ల లాభం వస్తున్నదని వివరించారు. కార్యక్రమంలో ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచెర్ల రామకృష్ణారెడ్డి, ఎండీ సురేందర్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ వర్సిటీకి చెందిన నాలుగు ఎకరాల భూమిని ఆయిల్ఫెడ్కు కేటాయించినందుకు ఆయిల్ఫెడ్ చైర్మన్ మంత్రి నిరంజన్రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఇక్కడ త్వరలో విజయ హైదరాబాద్ వంటనూనెల మెగా ప్యాకింగ్ సెంటర్ను నిర్మిస్తామని చెప్పారు.
ఉద్యానశాఖ ఉపసంచాలకుడు ప్రేమ్సింగ్నాయక్, సవిత దంపతుల కుమారుడు, సివిల్స్ 35వ ర్యాంకర్ సంకేత్కుమార్ను మంత్రి నిరంజన్రెడ్డి సన్మానించారు. ఉత్తమ ర్యాంక్ సాధించినందుకు అభినందించారు. మాతృభూమి గర్వపడేలా, తల్లితండ్రులకు పేరు తెచ్చేలా పనిచేయాలని సూచించారు. ప్రజల సమస్యల పరిషారానికి ప్రాధాన్యం ఇవ్వాలని, పేదల పట్ల జాలి, కరుణ చూపాలని తెలిపారు.