నాంపల్లి కోర్టులు, జనవరి 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని అన్ని జిల్లా కోర్టుల్లో జిల్లా జడ్జీల పోస్టులకు తెలంగాణ కోర్టుల్లో ప్రాక్టీసు చేస్తున్న న్యాయవాదులే అర్హులని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ టీ వినోద్కుమార్ ధర్మాసనం గురువారం స్పష్టం చేసింది. ఇతర రాష్ర్టాల్లో ప్రాక్టీసు చేస్తున్న న్యాయవాదులు అర్హులు కాదని తెలిపింది. తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ నిబంధనలు-2023లోని వ్యాలిడిటీ ఆఫ్ రూల్స్ 5(1)(ఎ)ప్రకారం ఈ నిబంధనలు వర్తిస్తాయని తీర్పులో పేర్కొన్నారు. స్థానిక కోర్టుల్లో ప్రాక్టీసు చేసిన న్యాయవాదులకు ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. జిల్లా జడ్జి నియామకాల నోటిఫికేషన్లో ఈ అంశాన్ని చేర్చే విధంగా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. డివిజన్ బెంచ్ తీర్పు ప్రకారం నియమ నిబంధనలు రూపొందించేందుకు చర్యలు చేపట్టనున్నారు.