హైదరాబాద్: రాష్ట్రంలో 3 కోట్ల కరోనా టీకాలు పంపిణీ చేసిన సందర్భంగా వైద్యారోగ్య శాఖకు చెందిన సిబ్బంది సంబురాలు చేసుకున్నారు. కోఠి డీహెచ్ కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వైద్యసిబ్బందికి ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వి అభినందనలు తెలిపారు. ప్రభుత్వం, వైద్యారోగ్య శాఖ సంయుక్త కృషితోనే ఈ మైలురాయిని చేరుకున్నామని ఆయన కొనియాడారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ప్రత్యేక డ్రైవ్ల ద్వారా వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. తొలి కోటి డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేయడానికి 165 రోజులు పట్టగా, రెండో కోటి చేరుకోవడానికి 81 రోజులు మాత్రమే పట్టిందని, మూడో కోటి డోసులను కేవలం 36 రోజుల్లోనే పూర్తిచేశామని సీఎస్ వెల్లడించారు.
వ్యాక్సిన్ విషయంలో సీఎం కేసీఆర్ మంచి మార్గదర్శకాలు అందించారని చెప్పారు. వ్యాక్సినేషన్ విషయంలో జాతీయ సగటుకన్నా తెలంగాణ ముందు వరుసలో ఉందని ఆయన తెలిపారు. మూడో వేవ్ను ఎదుర్కొనేందుకు కూడా అన్ని ఏర్పాట్లూ పూర్తి చేశామన్నారు. ఆసుపత్రుల్లో 27వేల పడకలకు ఆక్సిజన్ సదుపాయం కల్పించామని పేర్కొన్నారు.