ప్రజాసంఘాల కార్యకర్తల అరెస్టు
క్షమాపణ చెప్పాలి: పిడమర్తి రవి
తెలుగుయూనివర్సిటీ, ఫిబ్రవరి 14: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియపై ప్రధాని మోదీ వ్యాఖ్యలను నిరసిస్తూ సోమవారం ప్రజాసంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బీజేపీ రాష్ట్ర కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించారు. గన్పార్క్లోని అమరవీరుల స్థూపం నుంచి నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం వైపు వెళ్తుండగా ప్రజాసంఘాల నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా తోపులాట జరగడంతో కొద్దిసేపు ఉద్రిక్తత ఏర్పడింది. ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలను అవమానించేలా మాట్లాడిన ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రం ఏర్పడి ఎనిమిదేండ్లు అవుతున్నా అభివృద్ధికి నిధులు ఇవ్వకపోగా, ఉద్రిక్తత పరిస్థితి నెలకొనేలా ప్రధాని మాట్లాడటం హేయమైన చర్య అని చెప్పారు. ప్రజాసంఘాల జేఏసీ నేత గజ్జెల కాంతం మాట్లాడుతూ.. చట్టసభలను, తెలంగాణ ప్రజలను మోదీ అవమానించారని విమర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్, ధర్మపురి అర్వింద్కు చట్టాల పట్ల అవగాహన లేదని దుయ్యబట్టారు.