తెలంగాణ ప్రగతి విజయగాథకు రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ప్రసంగం అద్దం పట్టింది. దేశమే అబ్బురపడేలా ఎనిమిదేండ్లలోనే రాష్ట్రం అసాధారణ విజయాలు సాధించిందని గవర్నర్ కొనియాడారు. రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. తొలిరోజు అసెంబ్లీ, మండలి సంయుక్త సమావేశంలో గవర్నర్ ప్రసంగించారు. రాష్ట్రంలోని సకల వర్గాలు సాధించిన అభివృద్ధిని తన ప్రసంగంలో వివరించారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం కొత్త ప్రమాణాలు సెట్ చేసి, దేశానికి దిక్సూచిగా మారిందని కొనియాడారు. రైతులు, కూలీలు, వృద్ధులు, మహిళలు, విద్యార్థులు, ఉద్యోగార్థులు.. ఇలా ప్రతి ఒక్కరికి ప్రభుత్వం మేలు చేసిందని తెలిపారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. అన్ని రంగాల్లోనూ అనూహ్య వృద్ధి సాధిస్తున్నదని, అన్ని వర్గాల ప్రజలపై సంక్షేమ వరాలు కురుస్తున్నాయని కొనియాడారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించి, ఉభయ సభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. ‘పుట్టుక నీది, చావు నీది.. బతుకంతా దేశానిది’ అన్న ప్రజాకవి కాళోజీ నారాయణరావు సందేశంతో ప్రసంగాన్ని ప్రారంభించారు గవర్నర్. కాళోజీ చెప్పినట్టు మన జీవితాలను దేశం కోసం అంకితం చేద్దామని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రతి రంగంలోనూ దేశం ఆశ్చర్యపోయేలా అద్భుత ప్రగతిని ఆవిషరిస్తూ, పురోగమిస్తున్నదని చెప్పారు. తెలంగాణ సమ్మిళిత, సమగ్రాభివృద్ధి యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నదని పేర్కొన్నారు. ప్రజల ఆశీస్సులు, సీఎం కేసీఆర్ పాలనా దక్షత, ప్రజా ప్రతినిధుల నిరంతర కృషి, ప్రభుత్వ సిబ్బంది అంకితభావం వల్లే రాష్ట్రం అపూర్వ విజయాలు సాధించిందని చెప్పారు. ఒకప్పుడు కరెంటు కోతలతో అంధకారంలో కొట్టుమిట్టాడిన తెలంగాణ, ఇప్పుడు నిరంతర విద్యుత్తు సరఫరాతో వెలుగు జిలుగుల రాష్ట్రంగా విరాజిల్లుతున్నదని అన్నారు. ఒకప్పుడు వ్యవసాయం కుదేలైపోయిన ప్రాంతం, నేడు దేశానికే ధాన్యాగారంగా అవతరించిందని చెప్పారు. తాగునీటి కోసం తల్లడిల్లిన పరిస్థితుల నుంచి ఇంటింటికీ నల్లాల ద్వారా సురక్షిత జలాలను సరఫరా చేసే స్థాయికి ఎదిగిందని పేర్కొన్నారు. ఒకప్పుడు తెలంగాణ గ్రామాలు పాడుబడినట్టు ఉండేవని, నేడు అత్యున్నత జీవన ప్రమాణాలతో వాటి రూపు రేఖలు మారిపోయాయని వెల్లడించారు. పెట్టుబడులకు స్వర్గధామంగా, ప్రపంచస్థాయి సంస్థలకు గమ్యస్థానంగా, ఐటీరంగంలో మేటి రాష్ట్రంగా ప్రగతిపథంలో పరుగులు పెడుతున్నదని ప్రశంసించారు. పర్యావరణ పరిరక్షణలో, పచ్చదనం పెంపులో ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు అందుకొంటున్నదని అన్నారు. అగాధ పరిస్థితిలో ఉన్న తెలంగాణను ఆదర్శవంతమైన రాష్ట్రంగా మార్చే ప్రయత్నంలో ప్రభుత్వం అనేక సవాళ్లను దీటుగా ఎదురొన్నదని తెలిపారు. అస్పష్టతలను చేధించి, అవరోధాలను చాకచక్యంగా అధిగమించిందని, ఎనిమిదిన్నరేండ్ల స్వల్ప వ్యవధిలోనే అనేక విజయాలు సాధించిందని వివరించారు. అత్యంత బలీయమైన ఆర్థిక శక్తిగా, సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే అగ్రగామి రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని కొనియాడారు.
రాష్ట్ర తలసరి ఆదాయం 2014-15లో రూ.1,24,104 ఉండగా, 2023-24 నాటికి రూ.3,17,117కు పెరిగిందని గవర్నర్ తెలిపారు. రాష్ట్ర ఆదాయం రూ.62 వేల కోట్ల నుంచి 2021 నాటికి రూ.1.84 లక్షల కోట్లకు పెరిగిందని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత అన్నిరంగాల్లోనూ అభివృద్ధి గతంకన్నా రెట్టింపు స్థాయిలో జరిగిందని పేర్కొన్నారు. అన్నిరంగాల్లో పెట్టుబడి వ్యయాన్ని పెంచుతూ అనూహ్య ప్రగతి సాధించినందుకు ప్రభుత్వానికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.
3,17,117 2023-24
1,24,104 2014-15
1.84 లక్షల కోట్లు 2021-22
62 వేల కోట్లు 2014-15
చరిత్రలో కనీవినీ ఎరుగని విధంగా వ్యవసాయరంగంలో తెలంగాణ గొప్ప స్థిరీకరణ సాధించామని గవర్నర్ పేర్కొన్నారు. దేశ వ్యవసాయ రంగంలో నూతన చరిత్రను లిఖించామని ప్రకటించారు. గతంలో దండుగ అని ఈసడించిన వ్యవసాయాన్ని రాష్ట్ర ప్రభుత్వం పండుగలా మార్చిందని ప్రశంసించారు. వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తు సరఫరాతో రైతుల్లో భరోసా పెరిగిందని తెలిపారు. మిషన్ కాకతీయతో చెరువుల పునరుద్ధరణ, పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడం, యుద్ధ ప్రాతిపదికన భారీ, మధ్యతరహా, చిన్న ప్రాజెక్టులను నిర్మించడం, విసృ్తతంగా చెక్ డ్యాముల నిర్మాణం వంటివి సాగుకు బలాన్నిచ్చాయని వివరించారు. మూడున్నరేండ్ల రికార్డు సమయంలో నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు మానవ నిర్మిత మహాద్భుతంగా ప్రపంచం దృష్టిని ఆకర్షించిందని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి స్థాపిత విద్యుత్తు సామర్థ్యం 7,778 మెగావాట్లు మాత్రమే అని, ప్రభుత్వ కృషి ఫలితంగా 18,453 మెగావాట్లకు పెరిగిందని గవర్నర్ తెలిపారు. 2014-15లో తెలంగాణ తలసరి విద్యుత్తు వినియోగం 1,356 యూనిట్లు మాత్రమే ఉండేదని, 2021-22 నాటికి 2,126 యూనిట్లకు పెరిగిందని చెప్పారు. రాష్ట్రం సాధించిన అద్భుత ప్రగతికి ఇది ప్రబల సూచిక అని అభివర్ణించారు.
తాగునీటి కష్టాలకు సంపూర్ణ ముగింపునిచ్చిన రాష్ట్రంగా తెలంగాణ చారిత్రక విజయం సాధించిందని గవర్నర్ అభినందించారు. మిషన్ భగీరథతో రాష్ట్రంలోని ప్రతి ఆవాసానికి సురక్షిత తాగునీరు సరఫరా అవుతున్నదని తెలిపారు. రాష్ట్రంలో ఫ్లోరైడ్ పీడ సంపూర్ణంగా అంతమైందని కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ పార్లమెంటులోనే ప్రకటించిందని గుర్తుచేశారు.
దళితజాతి స్వావలంబన కోసం ప్రభుత్వం విప్లవాత్మంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశానికి దిక్సూచిగా నిలిచిందని గవర్నర్ కొనియాడారు. దేశ చరిత్రలో దళితుల సంక్షేమం కోసం డాక్టర్ బీఆర్ అంబేదర్ చేసిన మహోద్యమం తర్వాత.. ఆ స్ఫూర్తితో, విశాల దృక్పథంతో దళితుల సమగ్రాభివృద్ధి కోసం కొనసాగుతున్న పథకంగా దళితబంధును అభివర్ణించారు. దేశ చరిత్రలోనే మొదటిసారిగా దళిత కుటుంబానికి ఉపాధి కల్పన కోసం రూ.10 లక్షలను ఉచిత గ్రాంటుగా ఇస్తున్నదని పేర్కొన్నారు. ప్రభుత్వం, లబ్ధిదారుల భాగస్వామ్యంతో దళిత రక్షణ నిధిని ఏర్పాటు చేశారని, దెబ్బతిన్న లబ్ధిదారుల కుటుంబాలకు ఈ నిధి అండగా ఉంటుందని వివరించారు. దళితులు వ్యాపారాల్లోకి ప్రవేశించేందుకు ప్రభుత్వ లైసెన్సుల జారీలో ప్రత్యేక రిజర్వేషన్లు అమలు చేస్తున్నదని తెలిపారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం 6 శాతం రిజర్వేషన్ ఉండేదని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఎస్టీ జనాభా 10 శాతానికి పెరిగిందని గవర్నర్ తెలిపారు. దీనికి అనుగుణంగా ప్రభుత్వం ఆదివాసీ, గిరిజనులకు ఇచ్చిన మాట ప్రకారం రిజర్వేషన్ను 10 శాతానికి పెంచిందని గుర్తుచేశారు. ‘మా తండాలో.. మా రాజ్యం, మా గూడెంలో.. మా రాజ్యం’ అనేది ఎస్టీ ప్రజల చిరకాల వాంఛ అని, దానిని రాష్ట్ర ప్రభుత్వం సాకారం చేసిందని వెల్లడించారు. 500 జనాభా దాటిన 2,471 గిరిజన తండాలకు, గూడేలకు గ్రామ పంచాయతీ హోదా కల్పించిందని వివరించారు. దీంతో 3,146 మంది గిరిజన బిడ్డలు సర్పంచ్లుగా మారి, గ్రామాభివృద్ధిలో సగర్వంగా భాగస్వాములు అవుతున్నారని చెప్పారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం వెనుకబడిన వర్గాల వృత్తి పనులకు చేయూతనందిస్తున్నదని గవర్నర్ తెలిపారు. గొల్లకుర్మల కోసం: రూ.11 వేల కోట్లతో 7.3 లక్షల యూనిట్ల గొర్రెల పంపిణీని చేపట్టిందని, ఇప్పుడు దేశంలో ఎక్కువ సంఖ్యలో గొర్రెలు కలిగి ఉన్నది మన రాష్ట్ర గొల్ల కురుమలేనని చెప్పారు. మాంసం ఉత్పత్తిలో దేశంలోనే 5వ స్థానంలో నిలిచామని ప్రకటించారు.
మత్స్య కార్మికుల కోసం: రాష్ట్రంలోని చెరువులు, ప్రాజెక్టుల ద్వారా ఏర్పడిన నూతన జలాశయాలు, ఇతర నీటి వనరుల్లో ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నదని గవర్నర్ చెప్పారు. ఉచితంగా చేప పిల్లలు వదలడంతోపాటు వాటిని పట్టుకొని లబ్ధిపొందే హకును మత్స్యకారులకే ఇచ్చిందని కొనియాడారు.
నేతన్నల కోసం: దెబ్బతిన్న చేనేత రంగాన్ని తిరిగి నిలబెట్టేందుకు ఎనిమిదిన్నరేండ్లుగా ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని గవర్నర్ తెలిపారు. బతుకమ్మ చీరల తయారీతో నేత, పవర్లూమ్ కార్మికులకు చేతినిండా పని కల్పిస్తున్నదని కొనియాడారు. చేనేత మిత్ర పథకం ద్వారా నూలు, రసాయనాలపై 50 శాతం సబ్సిడీ ఇస్తున్నదని చెప్పారు. నేతన్నకు బీమా పథకం కింద ప్రభుత్వమే ప్రీమియం చెల్లిస్తూ రూ.5 లక్షల జీవిత బీమాను కల్పించిందని వివరించారు.
గీత కార్మికుల కోసం: గీత కార్మికుల కోసం ప్రభుత్వం వైన్ షాపుల కేటాయింపుల్లో 15 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నదని గవర్నర్ తమిళిసై తెలిపారు. తాటి, ఈత చెట్లపై పన్నును రద్దు చేసిందని, గత బకాయిలను మాఫీ చేసిందని గుర్తుచేశారు. ప్రమాదవశాత్తు మరణిస్తే కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందిస్తున్నదని చెప్పారు. నీరాను సాఫ్ట్ డ్రింక్గా ప్రవేశపెడుతున్నదని, ఇందుకోసం నీరా ప్రాసెసింగ్ యూనిట్, నీరాకేఫ్ను నిర్మించిందని వివరించారు.
రజకులు, నాయీ బ్రాహ్మణుల కోసం: లాండ్రీలకు, సెలూన్లకు 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును ప్రభుత్వం అందిస్తున్నదని గవర్నర్ తెలిపారు. హైదరాబాద్లో 41 బీసీ కులాల కోసం ప్రభుత్వం ఆత్మగౌరవ భవనాలను నిర్మిస్తున్నదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు 19 బీసీ రెసిడెన్షియల్ విద్యాలయాలుంటే.. వాటిని 310 వరకు పెంచిందని అభినందించారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని మతాలను సమానంగా ఆదరిస్తూ అందరి విశ్వాసాన్ని చూరగొంటున్నదని గవర్నర్ తెలిపారు. విద్య ద్వారానే మైనారిటీల్లో వెనుకబాటుతనం తొలగుతుందనే భావనతో 203 మైనారిటీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసిందని చెప్పారు. తర్వాత వీటిని మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలుగా అప్గ్రేడ్ చేసిందని, రంజాన్, క్రిస్మస్ సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేక కానుకలను అందిస్తున్నదని పేర్కొన్నారు.
సకల జనుల సంక్షేమాన్ని బాధ్యతగా స్వీకరించిన ప్రభుత్వం.. పేద బ్రాహ్మణుల కోసం బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ను ఏర్పాటు చేసిందని తెలిపారు. వివిధ పథకాల ద్వారా ఉపాధి కల్పనకు, విదేశాల్లో చదువుకోవడానికి ఆర్థిక సహాయం చేస్తున్నదని తెలిపారు.
ఒక దేశంలో మహిళలు సాధించిన అభివృద్ధినే ప్రగతికి కొలమానంగా తీసుకొంటారని అంబేదర్ చెప్పిన విషయాన్ని గవర్నర్ పేర్కొన్నారు. మహిళా సంక్షేమం కోసం ప్రభుత్వం అత్యుత్తమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని తెలిపారు. ఆరోగ్యలక్ష్మి పథకం కింద అంగన్వాడీల్లో గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందిస్తున్నదని, ఈ పథకాన్ని నీతి ఆయోగ్ ప్రశంసించిందని చెప్పారు. అంగన్వాడీ టీచర్లకు దేశంలో అత్యధిక పారితోషికం తెలంగాణలోనే లభిస్తున్నదని, ఆశ వరర్ల పారితోషికాన్ని రూ.2 వేల నుంచి రూ.9,750 పెంచిందని తెలిపారు. దేశంలోనే మొదటిసారి ప్రభుత్వోద్యోగులతో సమానంగా హోంగార్డులు, అంగన్వాడీ, ఆశ, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి సైతం పీఆర్సీని వర్తింపజేసిందని ప్రశంసించారు. సివిల్ పోలీసు ఉద్యోగాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ అమలు చేస్తున్నదని తెలిపారు. మహిళలపై వేధింపులను అడ్డుకొనే షీ టీమ్స్ అద్భుతంగా పనిచేస్తున్నాయని, ఇతర రాష్ర్టాలు దీనిని అనుసరిస్తున్నాయని
కొనియాడారు.
రాష్ట్ర ప్రభుత్వం మానవీయ కోణంలో ఆలోచించి పేదలకు, అసహాయులకు ఆసరా పెన్షన్లు అందిస్తున్నదని గవర్నర్ తెలిపారు. పేదలకు ఇచ్చే వృద్ధాప్య పెన్షన్ అర్హత వయో పరిమితిని 57 సంవత్సరాలకు తగ్గించిందని చెప్పారు. ఒంటరి మహిళలు, దివ్యాంగులు, బోదకాలు బాధితులు, డయాలసిస్ రోగుల జీవన భద్రత కోసం ప్రభుత్వం భారీ ఎత్తున నిధులు వినియోగిస్తున్నదని వెల్లడించారు. ప్రభుత్వం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం కింద రూ.1,00,116 ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నదని చెప్పారు. ఇప్పటివరకు 12,00,469 మంది ఆడపిల్లల కుటుంబాలకు లబ్ధి చేకూరిందని వివరించారు.
ప్రపంచవ్యాప్తంగా ఆర్ధిక మాంద్యం భయంతో ఉద్యోగులను తొలగిస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం మాత్రం కొలువుల జాతర కొనసాగిస్తున్నదని గవర్నర్ తెలిపారు. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగాలను ఒకేసారి భర్తీ చేస్తున్నదని చెప్పారు. స్థానికులకే 95 శాతం ఉద్యోగాలు దక్కేలా కొత్త జోనల్ వ్యవస్థను రూపొందించిందని వెల్లడించారు. 2014 జూన్ నుంచి ఫిబ్రవరి, 2022 వరకు ప్రత్యక్ష నియామకాల ద్వారా 1,41,735 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ పూర్తయిందని తెలిపారు. ప్రస్తుతం 80,039 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్నదని, మొత్తంగా 2,21,774 ఉద్యోగ నియామకాలు జరిపి తెలంగాణ చరిత్రలో ఒక అపురూప ఘట్టాన్ని ఆవిష్కరించిందని ప్రశంసించారు.
పేద విద్యార్థులకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యాబోధన, వసతి కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం గురుకుల విద్యకు అమిత ప్రాధాన్యం ఇచ్చిందని గవర్నర్ తెలిపారు. దేశంలో అత్యధికంగా వెయ్యికిపైగా గురుకులాలున్న ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని, ఇది గర్వించదగిన విషయమని పేర్కొన్నారు. ఇక్కడ శిక్షణ పొందిన పేదవర్గాల పిల్లలు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతున్నారని చెప్పారు. ప్రభుత్వ స్కూళ్లలో కార్పొరేట్ స్థాయి వసతులను కల్పించేందుకు నాణ్యమైన విద్యను అందించాలని ప్రభుత్వం ‘మన ఊరు – మన బడి / మన బస్తీ – మన బడి’ అమలు చేస్తున్నదని తెలిపారు. ఇందులో భాగంగా మూడుదశల్లో 7,289 కోట్ల వ్యయంతో 26,065 పాఠశాలల్లో 12 రకాల మౌలిక వసతులను కల్పిస్తున్నదని చెప్పారు.
దేశంలో అత్యుత్తమ వైద్యసేవలందించే రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో ఉన్నదని నీతి ఆయోగ్ ప్రశంసించిందని గవర్నర్ గుర్తు చేశారు. రాష్ట్రంలోని అన్ని దవాఖానల్లో ప్రభుత్వం మౌలిక వసతులను కల్పించిందని తెలిపారు. 20 జిల్లాల్లో డయాగ్నోస్టిక్ సెంటర్లు ఉన్నాయని, మరో 13 అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ప్రభుత్వం 104 డయాలసిస్ సెంటర్లను అందుబాటులోకి తెచ్చిందని పేర్కొన్నారు. హైదరాబాద్ నలువైపులా 4 సూపర్ స్పెషాలిటీ దవాఖానలు, నిమ్స్లో మరో 2 వేల పడకలను, వరంగల్లో రూ.1100 కోట్లతో 2 వేల పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ను నిర్మిస్తున్నదని చెప్పారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు తెలంగాణలో మూడు ప్రభుత్వ మెడికల్ కాలేజీలుంటే.. ఎనిమిదిన్నరేండ్లలో 12 కాలేజీలను ఏర్పాటు చేసిందని వెల్లడించారు. ఈ ఏడాది మరో 9 మెడికల్ కాలేజీలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. పట్టణాల్లోని పేదల కోసం 342 బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసిందని, వీటి స్ఫూర్తితో పల్లె దవాఖానాలను ప్రారంభిస్తున్నదని తెలిపారు. కేసీఆర్ కిట్స్, న్యూట్రిషన్ కిట్స్, ఆరోగ్య లక్ష్మి తదితర పథకాల వల్ల వివిధ ఆరోగ్య సూచీల్లో తెలంగాణ అద్భుత పురోగతిని సాధించిందని ప్రశంసించారు. దవాఖానల్లో ప్రసవాల రేటు 30 శాతం నుంచి 61 శాతానికి పెరిగిందని, మాతృ మరణాల రేటు 92 నుంచి 43కు, శిశు మరణాల రేటు 39 నుంచి 21కి తగ్గిందని వివరించారు.
ప్రభుత్వం ప్రవేశపెట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామీణ జీవన ప్రమాణాలు గణనీయంగా పెరిగాయని గవర్నర్ తెలిపారు. ప్రభుత్వం, స్థానిక సంస్థలు సమన్వయంతో చేసిన పటిష్ఠ కార్యాచరణతో గ్రామాలు పచ్చదనం, పరిశుభ్రతతో కళకళలాడుతున్నాయని చెప్పారు. ప్రతి గ్రామానికి ట్రాక్టర్, ట్రాలీ, డంప్యార్డు, నర్సరీలు, పల్లె ప్రకృతివనాలు, వైకుంఠధామం వంటి మౌలిక వసతులు సమకూరాయని వెల్లడించారు. కేంద్రం ప్రకటించే అవార్డుల్లో అత్యధికం తెలంగాణకే రావడం సంతోషంగా ఉన్నదని అన్నారు. పట్టణ ప్రగతితో పట్టణాల్లోనూ పారిశుధ్యం పెరిగిందని తెలిపారు. సమీకృత వెజ్, నాన్వెజ్ మారెట్ల నిర్మాణం, పబ్లిక్ టాయిలెట్స్, వైకుంఠధామాలు వంటి మౌలిక వసతుల కల్పన జరిగిందని వివరించారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం యజ్ఞంలా కొనసాగిస్తున్నదని అన్నారు. తెలంగాణలో గ్రీన్ కవర్ 7.7 శాతం పెరిగిందని ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా చెప్పిందని, హైదరాబాద్ నగరానికి ట్రీ సిటీ ఆఫ్ ద వరల్డ్ గుర్తింపు దక్కిందని తెలిపారు.
పారిశ్రామిక, ఐటీ రంగాల్లో అనూహ్య అభివృద్ధి పారిశ్రామిక, ఐటీ రంగాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన టీఎస్ ఐపాస్ చట్టంతో విప్లవాత్మక పురోగతి సాధ్యమైందని గవర్నర్ తెలిపారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్తు సరఫరా, మెరుగైన శాంతిభద్రతల నిర్వహణ వంటి కారణాల వల్ల రాష్ట్రానికి జాతీయ, అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నయని చెప్పారు. పారిశ్రామిక ఉత్పత్తి గణనీయంగా పెరిగిందన్నారు. ఎనిమిదిన్నరేండ్లుగా పారిశ్రామిక, ఐటీ రంగాల్లో 3.31 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, ఐటీ ఉద్యోగ నియామకాల్లో 140శాతం వృద్ధి నమోదైందన్నారు.
తెలంగాణ ప్రజల కొంగుబంగారమైన యాదాద్రి దేవాలయ పునర్నిర్మాణం ఒక చరిత్రాత్మక అద్భుతమని గవర్నర్ అన్నారు. అడుగడుగునా ఆధ్యాత్మిక భావం వెల్లివిరిసేలా దేవాలయాన్ని తీర్చిదిద్దిందని ప్రశంసించారు.
ప్రభుత్వం నూతనంగా నిర్మిస్తున్న సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేదర్ పేరును పెట్టినందుకు సభాముఖంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఈ భవనంలో అంతర్జాతీయ ప్రమాణాలతో అధునాతన వసతులను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. దేశంలో ఎకడా లేని విధంగా 125 అడుగులు అంబేదర్ విగ్రహాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠించడం సంతోషం కలిగిస్తున్నదన్నారు. సచివాలయానికి అభిముఖంగా నిర్మించిన అమరవీరుల స్మారక కేంద్రం ప్రారంభానికి సిద్ధంగా ఉన్నదని చెప్పారు. పరిపాలనను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వం రాష్ట్రాన్ని 33 జిల్లాలుగా పునర్విభజించిందని, ప్రతి జిల్లాలో సమీకృత కలెక్టరేట్ భవనాలను ఘనంగా నిర్మిస్తున్నదని అన్నారు.
శాంతి భద్రతల పరిరక్షణను పటిష్ఠంగా అమ లు చేస్తుండటం వల్ల రాష్ట్రంలో పౌరజీవనం ప్రశాంతంగా సాగుతున్నదని గవర్నర్ అన్నారు. రాష్ట్రంలో నిఘా వ్యవస్థను పటిష్ఠం చేస్తూ దేశంలోనే అత్యధికంగా 9.8 లక్షల సీసీ కెమెరాలను ప్రభుత్వం ఏర్పాటు చేసి, నేరాల నియంత్రణ లో దేశంలోనే ముందున్నదన్నారు. విపత్తుల సందర్భంలో నియంత్రణ, సహాయ కార్యక్రమా ల సమన్వయం కోసం ఏర్పాటు చేసిన కమాం డ్ కంట్రోల్ సెంటర్ ప్రపంచస్థాయి పోలీసింగ్ వ్యవస్థకు తారాణమని అభినందించారు.