నల్లగొండ: రైతు వేదిక ( Raitu Vedika ) ప్రారంభం సహా వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలానికి వచ్చిన మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, గుంటకండ్ల జగదీష్ రెడ్డిలకు మండల నాయకులు, స్థానికులు భారీ బైక్ ర్యాలీతో ఘన స్వాగతం పలికారు. మంత్రులతోపాటు ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ కూడా ఉన్నారు. ఈ సందర్భంగా స్థానిక నేతలు, ప్రజలు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎడ్ల బండి ఎక్కించి ఊరేగించారు.
అనంతరం శాలిగౌరారం మండల వ్యవసాయ మార్కెట్ యార్డులో మూడు కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన గోదామును, 22 లక్షల రూపాయలతో నూతనంగా నిర్మించిన రైతు వేదికను మంత్రులు ప్రారంభించారు. అనంతరం మార్కెట్ యార్డులో స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్ కుమార్ అధ్యక్షతన మండల ప్రజలతో సభ నిర్వహించారు. ఈ సభలో మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యే ప్రసంగించారు.