హైదరాబాద్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): కొవిడ్ కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకొంటున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. కొవిడ్ నిర్ధారణ పరీక్షల సంఖ్య పెంచినట్టు వెల్లడించింది. కరోనా అంశంపై గతంలో దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాల (పిల్)ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, న్యాయమూర్తి జస్టిస్ అభినంద్ కుమార్ షావిలితో కూడిన ధర్మాసనం బుధవారం మరోసారి విచారించింది.
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్నందున అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వానికి సూచించింది. ఇతర రాష్ర్టాలు, విదేశాల నుంచి వచ్చేవారికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నది. కేంద్రం జారీ చేసే మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని, కొవిడ్తో మరణించినవారి కుటుంబసభ్యులకు పరిహార చెల్లింపు వేగవంతం చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 22వ తేదీకి వాయిదా వేసింది.