హైదరాబాద్, ఏప్రిల్ 21 (నమస్తే తెలంగాణ): అప్రెంటిస్షిప్పై ఆసక్తిచూపుతున్నవారి సంఖ్య ఎక్కువగా ఉన్న మెట్రోనగరాల్లో హైదరాబాద్ అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోని మిగతా మెట్రోనగరాలను వెనక్కినెట్టి ముందు వరుసలో నిలిచింది. ఈ విషయాన్ని టీమ్లీజ్ అప్రెంటిస్షిప్ ఔట్లుక్ నివేదిక వెల్లడించింది. నెట్ అప్రెంటిస్షిప్ రేటు (ఎన్ఏవో)లో హైదరాబాద్ 78 శాతంతో ముందంజలో ఉండగా, ఆ తర్వాత ఢిల్లీ 74, బెంగళూరు 68తో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ సంస్థ అప్రెంటిస్షిప్పై జాతీయంగా 14 నగరాలు, 24 పరిశ్రమలు, 597 మంది యజమానులపై సర్వే చేసింది. 2022 నాలుగో త్రైమాసికం (2023 జనవరి నుంచి మార్చి వరకు) గల వివరాలను టీమ్లీజ్ వెల్లడించింది.
హైదరాబాద్లో 83 శాతం మంది అప్రెంటిస్షిప్పట్ల ఆసక్తి చూపుతుండగా.. ఆ తర్వాత ఢిల్లీ 82 శాతం, బెంగళూరు 80 శాతం, చెన్నై 81 శాతం, ముంబై 77 శాతంతో ఆ తర్వాతి స్థానంలో ఉన్నాయి. రంగాలవారీగా తీసుకొంటే ఇంజినీరింగ్లో అత్యధికంగా 90 శాతం, ఎన్ఏవో, ఎలక్ట్రిక్స్, ఎలక్ట్రానిక్స్లో 88 శాతం, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ సెక్టార్లో 85 శాతం మంది అప్రెంటిస్షిప్ను ఎంచుకొంటున్నారు. 2023లో హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరులో అప్రెంటిస్షిప్నకు మరింత ఆదరణ లభిస్తుందని టీమ్లీజ్ ప్రతినిధి సుమిత్కుమార్ తెలిపారు. ఐటీ, లైఫ్ సైన్సెస్, ఫార్మాస్యూటికల్ కంపెనీలు, డిఫెన్స్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్లతోపాటు టెక్ స్టార్టప్లకు హైదరాబాద్ కేంద్రంగా ఉండటంతోనే ఇక్కడ అప్రెంటిస్షిప్నకు పుష్కలమైన అవకాశాలు లభిస్తున్నాయని వెల్లడించారు.