వికారాబాద్ : విద్యార్థుల్లో చదువుపై ఆసక్తి పెంచేలా ఉపాధ్యాయులు బోధన చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. వికారాబాద్ నియోజకవర్గం మోమిన్ పెట్ మండలం,చంద్రయాన్ పల్లిలో రూ. 2 .05 లక్షలతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం అదనపు గదులు, ప్రయోగశాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో మట్టిలో మాణిక్యాలు ఉంటారని వారిని సాన బెడితే అణిముత్యాలు లాంటి విద్యార్థులు బయటకు వస్తారని అన్నారు.
గతంలో అమ్మాయిలను చదివించటం కష్టంగా ఉండేదని, ప్రభుత్వం కల్పిస్తున్న వసతుల వల్ల నేడు విశ్వవిద్యాలయాలు అమ్మాయిలతో నిండి పోయాయని తెలిపారు. ఓయూలో 70 శాతం,కాకతీయ యూనివర్సిటీ లో 80 శాతం విద్యార్థినిలతో నిండిపోయాయని పేర్కొన్నారు. విద్యార్థులకు చదువును మించిన ఆస్తి ఏమి ఉండదని,బాగా చదివి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ఇందులో భాగంగా గురుకులాలు, కేజీబీవీ పాఠశాలలు నెలకొల్పి వాటిని ఇంటర్ వరకు అప్ గ్రేడ్ చేశారని వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ సునీత మహేందర్ రెడ్డి , ఎంపీ రంజిత్ రెడ్డి , ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్, ,అడిషనల్ కలెక్టర్, డీఈవో , ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.