హైదరాబాద్ : దివ్యాంగ పిల్లలకు ప్రత్యేక పద్దతుల్లో విద్యాబోధన చేయడం చేయడం గొప్ప విషయమని, ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రిసోర్స్ పర్సన్స్ ( I.E.R.P ) పాత్ర అమోఘం అని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. మంగళవారం శ్రీనగర్ కాలనీలోని సత్య సాయి నిగమాగమంలో జరిగిన ఐ.ఈ.ఆర్.పీ. ల రాష్ట్ర సదస్సులో వినోద్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ బుద్ధి మాంద్యం, మానసికంగానూ, అంగ వైకల్యంగానూ బాధపడుతున్న పిల్లలకు, కళ్ళు కనిపించని, చెవులు పినిపించని పిల్లలకు ప్రత్యేక పద్దతుల్లో విద్యాబోధన చేస్తున్న ఐ.ఈ.ఆర్.పీ. ల సేవలు సమాజంలో ప్రతి ఒక్కరికీ కదిలిస్తాయని తెలిపారు.ఈ విషయంలో ఎంతో ఓపికతో విద్యా బోధన చేస్తున్న ఐ.ఈ.ఆర్.పీ.ల ఉద్యోగ సర్వీస్ ను క్రమబద్ధీకరణ చేసే విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని వినోద్ కుమార్ హామీనిచ్చారు.
మనసున్న మారాజు, ఎలాంటి సమస్యలు ఉన్నా వాటి పరిష్కారం కోసం నిరంతరం తపించే గొప్ప వ్యక్తి సీఎం కేసీఆర్ అని వినోద్ కుమార్ పేర్కొన్నారు. తెలంగాణ నాటి, నేటి పరిస్థితులను వినోద్ కుమార్ సోదాహరణంగా వివరించారు. ఉమ్మడి రాష్ట్రంలో దగా పడ్డ తెలంగాణ, స్వరాష్ట్రం తెలంగాణ సిద్ధించిన తర్వాత సాధించిన ప్రగతిని వినోద్ కుమార్ తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్, పీ.ఆర్.టీ.యు. రాష్ట్ర అధ్యక్షుడు శ్రీపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి కమలాకర్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, నాయకులు చెన్న కేశవ రెడ్డి, మోహన్ రెడ్డి, ఇన్నా రెడ్డి, ఐ.ఈ.ఆర్.పీ రాష్ట్ర అధ్యక్షులు సిల్వెరి వెంకటేష్, ప్రధాన కార్యదర్శి కొప్పుల కిరణ్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.