కరీంనగర్ : రాష్ట్ర అభివృద్ధిలో ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలి. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత 30 వేల మంది ఉపాధ్యాయులను నియమించామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆడిటోరియంలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రి జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు పురస్కారాలను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశ భవిష్యత్తు ఎక్కడి నుండో కాదు తరగతి గది నుంచే తయారవుతుంఇ. అంతటి పవిత్ర వృత్తి ఉపాధ్యాయవృత్తి అన్నారు.
భవిషత్ తరాలకు ఆస్తులను కాకుండా అంతకు విలువైన విద్యను అందించినప్పుడే ఆ దేశం అభివృద్ధి చెందుతుందని మంత్రి తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి మనకు 9 గురుకులాలు మాత్రమే ఉండేవని, తెలంగాణ వచ్చిన తరువాత వాటిని దాదాపు 300 గురుకులాలుగా అభివృద్ధి చేసుకున్నామని పేర్కొన్నారు.
అలాగే 5జీ డిజిటల్ తరగతుల నిర్వహణ దిశగా చర్యలు చేపడుతున్నామన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్, జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, జెడ్పీ చైర్పర్సన్ కనుమళ్ల విజయ, తదితరులు పాల్గొన్నారు.