హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ) : టీచర్ల చిరకాల కోరిక అయిన పదోన్నతులు, బదిలీల ప్రక్రియను ఈ నెల 27నుంచి ప్రారంభించనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. ఈ మేరకు మార్చి 4 వరకు మొత్తంగా 37 రోజుల పాటు పదోన్నతులు, బదిలీల ప్రక్రియ కొనసాగేలా అధికారులు షెడ్యూల్ను రూపొందించారు. బదిలీలు, పదోన్నతుల మార్గదర్శకాలకు సంబంధించి ఒకటీరెండు రోజుల్లో షెడ్యూల్ విడుదల చేయనున్నారు. టీచర్ల పదోన్నతులు, బదిలీలపై ఈనెల 15న ఉపాధ్యాయ సంఘాలు, జేఏసీల సమక్షంలో మంత్రులు హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డి సమగ్రంగా చర్చించిన విషయం తెలిసిందే. చర్చలు ఫలప్రదం కాగా, తాజాగా సీఎం కేసీఆర్ మార్గదర్శనం, ఆమోదం మేరకు పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు ముహూర్తం ఖరారైంది. రాష్ట్రంలో బదిలీలు, పదోన్నతులపై సాధారణ పరిపాలన శాఖ గతంలో నిషేధం విధించింది. ఈ మేరకు జీవో-91ను జారీచేయగా, ఈ నిషేధాన్ని ఎత్తివేస్తూ గురువారం రాత్రి జీఏడీ జీవోను విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో బదిలీలు, పదోన్నతులకు ఆస్కారమేర్పడింది. టీచర్ల బదిలీలు, పదోన్నతులు కల్పించే అంశంపై విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి శుక్రవారం అధికారులతో చర్చించారు. విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేనతో సమగ్రంగా చర్చించి వీలైనంత త్వరగా షెడ్యూల్ను విడుదల చేసి, పూర్తి పారదర్శకంగా బదిలీలు చేపట్టాలని వారిని ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పదోన్నతులు, బదిలీల ప్రక్రియను త్వరగా చేపట్టాలని సూచించారు. ఈ నెల 27 నుంచి ప్రక్రియను ప్రారంభించాలన్న మంత్రి ప్రకటన పట్ల ఉపాధ్యాయ సంఘాలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశాయి. ఉపాధ్యాయుల సుదీర్ఘకాలపు డిమాండ్ను నెరవేర్చిన ఎంప్లాయ్ ఫ్రెండ్లీ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపాయి. ఇందుకు చొరవ తీసుకున్న సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డిలకు పలు ఉపాధ్యాయ సంఘాలు కృతజ్ఞతలు తెలిపాయి.
సమస్యలు తీరి, సంతోషం నిండె
తెలంగాణ ఆవిర్భావం తర్వాత 2015 జూలై- ఆగస్టులో టీచర్లకు పదోన్నతులు, 2018 జూలైలో టీచర్ల బదిలీలు చేపట్టారు. రాష్ట్రంలో 2021 డిసెంబర్లో ప్రభుత్వం అన్నిశాఖల్లో పదోన్నతులు కల్పించింది. అయితే న్యాయపరమైన చిక్కులు టీచర్ల పదోన్నతులు, బదిలీలకు అడ్డంకిగా నిలిచాయి. తాజాగా అడ్డంకులన్నీ తొలగడంతో ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. అయితే బదిలీలు, పదోన్నతులు కల్పించినప్పటికీ టీచర్లంతా ఈ విద్యాసంవత్సరం ముగిసేవరకు పాత స్థానాల్లోనే కొనసాగుతారు.
విద్యాసంవత్సరం ముగిసిన ఏప్రిల్ 23న రిలీవ్ అయ్యి, కొత్త స్థానాల్లో చేరుతారు. ప్రభుత్వ టీచర్లతో పాటు, మాడల్ స్కూళ్లు, కేజీబీవీ టీచర్ల బదిలీలను సైతం చేపడుతారు. కౌన్సిలింగ్ ద్వారా పూర్తి పారదర్శకంగా వీటిని చేపడుతున్నారు. బదిలీలు, పదోన్నతులు కల్పించడంతో టీచర్ల సమస్యలన్నింటినీ ప్రభుత్వం తీర్చినట్టయ్యింది. టీచర్లకు పీఆర్సీతో ఆశాజనకమైన వేతన సవరణను ప్రభుత్వం అమలు చేసింది. జీవో-317తో ఇబ్బందులు ఎదుర్కొన్న టీచర్లకు పరస్పర బదిలీలు, స్పౌజ్ కోటా బదిలీలకు అవకాశానిచ్చింది. స్పౌజ్ కోటా బదిలీలు చేపట్టాలని సర్వీసు నిబంధనల్లో లేకపోయినా పూర్తిగా మానవతా ధృక్పథంతో ప్రభుత్వం ఉద్యోగ దంపతులు ఒకే జిల్లాలో ఉండేలా చర్యలు చేపట్టింది. దీంతో టీచర్ల సమస్యలన్నీ తీరగా, అంతటా సంతోషదాయకమైన వాతావరణం నెలకొంది.
కొత్త టీచర్ల రిక్రూట్మెంట్కు అవకాశం
కోర్టు కేసులు, ఇతరత్రా కారణాలతో బదిలీలు, పదోన్నతులు ఆలస్యమయ్యాయి. ఎట్టకేలకు ప్రక్రియను ప్రారంభించడం శుభపరిణామం. ఈ ప్రక్రియతో టీచర్లు కోరుకున్న స్థానానికి వెళ్లడమే కాకుండా కొత్తగా పనిచేసే చోట కొత్త ఉత్సాహంతో మరింత అంకితభావంతో పనిచేసేందుకు అవకాశ మేర్పడుతుంది. పదోన్నతులు, బదిలీలతో ఎస్జీటీ పోస్టులు ఖాళీ అవుతాయి. దీనివల్ల కొత్త రిక్రూట్మెంట్కు అవకాశమేర్పడుతుంది. బడులకు కొత్త టీచర్లు వస్తారు. ఎంతో ఆశతో ఉద్యోగాల కోసం వేచిచూస్తున్న వారికి టీచర్ ఉద్యోగం లభిస్తుంది.
– పాతూరి సుధాకర్రెడ్డి, మాజీ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ
9 వేల మందికి పదోన్నతులు
టీచర్లకు బదిలీలు, పదోన్నతులు కల్పించే అంశంపై మేము ఎప్పటి నుం చో సీఎం కేసీఆర్పై సంపూర్ణ విశ్వాసం వ్యక్తం చేస్తున్నాం. వనపర్తి కలెక్టరేట్ ప్రారంభోత్సవం రోజే పదోన్నతులు కల్పిస్తామని, బదిలీలు చేపడుతామని సీఎం కేసీఆర్ శుభవార్తను ప్రకటించారు. ఈ సమస్యను పరిష్కరించాలని అక్కడే సీఎస్ను ఆదేశించారు. తాజాగా చేపట్టే ప్రక్రియతో 9 వేల మంది టీచర్లకు పదోన్నతులు లభిస్తాయి. అనేక మంది టీచర్లు కోరుకున్న చోటికి బదిలీ అవుతారు. ఇదే తరహాలో పండిట్ల అప్గ్రేడేషన్ కోర్టుకేసును సైతం పరిష్కరించి వారికి అప్గ్రేడేషన్ తోపాటు, పదోన్నతులు చేపడితే న్యాయంజరుగుతుంది.
– టీచర్ ఎమ్మెల్సీ, కాటేపల్లి జనార్దన్రెడ్డి
విద్యాప్రమాణాలు మెరుగవుతాయి
బదిలీలు లేక, పదోన్నతులు లభించక, ఒకే చోట అనేక రోజులుగా పనిచేయడంతో టీచర్లంతా మనోవేదనకు గురవుతున్నారు. టీచర్ల సమస్యను గుర్తించిన ప్రభుత్వం ఎట్టకేలకు బదిలీలు, పదోన్నతులు చేపట్టడం శుభ పరిణామం. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో రాష్ట్రంలో విద్యాప్రమాణాలు మెరుగవుతాయి. గ్రామీణ, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుంది. ప్రభుత్వ బడుల్లో చేరిన వారికి న్యాయం చేకూరుతుంది.
– పింగిలి శ్రీపాల్రెడ్డి, పీఆర్టీయూ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు
సబ్జెక్టు టీచర్ల కొరత సమస్య తీరుతుంది
పదోన్నతులు, బదిలీలపై మంత్రులు హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డిలు ఉపాధ్యాయ సంఘాలతో చర్చించి సానుకూల నిర్ణయం వెలువరించడం శుభ పరిణామం. ఈ ప్రక్రియ చేపట్టడం ఉపాధ్యాయులకే కాకుండా పాఠశాలలకు సైతం అవసరం. పదోన్నతులు కల్పించడంతో ఉన్నత పాఠశాలల్లో సబ్జెక్టు టీచర్ల కొరత తీరుతుంది. ప్రభుత్వం మంచి నిర్ణయం తీసుకున్నది, ఈ నిర్ణయాన్ని మేం సంపూర్ణంగా స్వాగతిస్తున్నాం.
– చావా రవి, యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి
సంతోషంలో టీచర్లు
పదోన్నతులు, బదిలీలకు అవకాశం కల్పించడంతో రాష్ట్రంలోని టీచర్లంతా సంతోషంగా ఉన్నారు. బదిలీల కోసం వేచి చూస్తున్నవారికి, పదోన్నతులు లభిస్తాయని ఆశించిన వారికి ప్రభుత్వం ఎట్టకేలకు న్యాయం చేయడం శుభ పరిణామం. ఆన్లైన్లో పూర్తి పారదర్శకంగా చేపట్టాలని నిర్ణయించడాన్ని అంతా స్వాగతిస్తున్నారు. నూతన సంవత్సరం ప్రారంభంలోనే ప్రభుత్వం ప్రకటించిన శుభవార్తతో ఉపాధ్యాయ లోకమంతా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నది.
– సదానంద్గౌడ్, ఎస్టీయూ టీఎస్ రాష్ట్రఅధ్యక్షుడు
స్వాగతిస్తున్నాం
బదిలీలు, పదోన్నతులు చేపట్టాడాన్ని స్వాగతిస్తున్నాం. దీంతో ప్రభుత్వ బడులు బలోపేతమవుతాయి. నిర్వహణ మెరుగవుతుంది. టీచర్లకు ఇది పండుగలాంటిది. ఈ ప్రక్రియతో రాష్ట్రంలోని ఉన్నత పాఠశాలలన్నింటికీ ప్రధానోపాధ్యాయులుంటారు. పర్యవేక్షణ పటిష్టమవుతుంది. ఎస్జీటీలకు స్కూల్ అసిస్టెంట్లుగా పదోన్నతులు లభించడంతో స్కూళ్లల్లో సబ్జెక్టు టీచర్లుండి బడుల్లో బోధన మెరుగవుతుంది. పదోన్నతులు పొందిన టీచర్లు సంతృప్తికరంగా పనిచేస్తారు. దీంతో ఉత్తమ ఫలితాలు వస్తాయి.
– అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ
కేసీఆర్కు కృతజ్ఞతలు
టీచర్లంతా కోరుకున్న బదిలీలు, పదోన్నతులు కల్పించేందుకు 27 నుంచి షెడ్యూల్ను ప్రారంభించడంతో టీచర్లంతా పండుగ వాతావరణంలో ఉన్నారు. రాష్ట్రంలో నాణ్యమైన విద్యనందించేందుకు కృషిచేస్తున్న సీఎం కేసీఆర్, మంత్రులు హరీశ్రావు, సబితాఇంద్రారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు. సర్కారు టీచర్లతో పాటు, మాడల్ స్కూళ్లు, కేజీబీవీ టీచర్ల బదిలీలు చేపట్టడం హర్షణీయం. పాఠశాల విద్యకు, టీచర్లకు ఇక నుంచి ఉన్నవన్ని మంచి రోజులే.
– కూర రఘోత్తంరెడ్డి, టీచర్ ఎమ్మెల్సీ