హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్(మూల్యాంకనం) పారితోషికం పెండింగ్ ఉండటం, ఏడాది గడిచినా రూపాయి విడుదల కాకపోవడంపై ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహంతో ఉన్నాయి. కులగణన పారితోషికాన్ని కూడా సర్కార్ ఇంకా చెల్లించకపోవడంపై ఫైర్ అవుతున్నాయి. సర్కార్ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు ఉపాధ్యాయ సంఘాలు పిలుపు ఇచ్చాయి. పదో తరగతి స్పాట్ వాల్యుయేషన్ కేంద్రాల్లో మంగళవారం మధ్యాహ్న భోజన విరామ సమయంలో నిరసనలకు పిలుపు ఇచ్చాయి. టీచర్లంతా ఈ నిరసన ప్రదర్శనల్లో పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ టీచర్స్ జేఏసీ చైర్మన్ పుల్గం దామోదర్రెడ్డి, ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీఎస్సీ) చైర్మన్ చావ రవి, జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ టీచర్ ఆర్గనైజేషన్స్(జాక్టో) చైర్మన్ సదానందంగౌడ్ సంయుక్తంగా పిలుపు ఇచ్చారు.
2025 మార్చిలో నిర్వహించిన పదో తరగతి మూల్యాంకన పారితోషికం ఇంకా విడుదల కాలేదు. ఈ మొత్తం రూ. 20కోట్లకు పైగానే ఉంటుంది. కులగణన పూర్తయ్యి.. 18 నెలలు గడిచిపోయింది. 50వేల మందికి పైగా టీచర్లు కుల గణనలో భాగస్వామ్యమయ్యారు. ఎన్యుమరేటర్కు రూ. 10వేలు, సూపర్వైజర్కు రూ. 12వేలు పారితోషికంగా అందాల్సి ఉంది. ఈ మొత్తం రూ. 50కోట్లకు పైగా ఉంటుంది. ఉపాధ్యాయ సంఘాలు ఎన్నిసార్లు విజ్ఞప్తిచేసినా, ఈ పారితోషికం విడుదల విషయంపై సర్కార్ నుంచి స్పందన కరువైంది. దీంతో మూడు ఉపాధ్యాయ సంఘాల జేఏసీలు ఆందోళనలకు పిలుపునిచ్చాయి. ఎస్సెస్సీ మూల్యాంకన రేట్లను 50% పెంచాలని దామోదర్రెడ్డి, చావ రవి, సదానందం డిమాండ్ చేశారు.