హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): ఎస్సీ గురుకుల సొసైటీలో ప్రధాన పో స్టుల నియామకానికి సంబంధించిన స్టాండింగ్ ఆర్డర్స్కు తూట్లు పొడించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. 2017లో ఇచ్చిన మార్గదర్శకాలకు పాతరవేసేందుకు సైతం పూనుకున్నది. అందుకోసమే గురుకుల అసోసియేషన్లతో సోమవారం ప్రత్యేకంగా భేటీని ఏర్పాటు చేసింది. ఉపాధ్యాయ జేఏసీ నేతలను చర్చల పేరిట పిలిచి ఆమోదం తీసుకున్నది.
గురుకుల జేఏసీ నేతలతో ప్రత్యేక భేటీ
ఎస్సీ గురుకులంలో నెలకొన్న సమస్యలపై చర్చించేందుకు గురుకుల ఉపాధ్యాయ సంఘాల ఐక్యవేదిక నేతలతో ఎస్సీ అభివృద్ధిశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, గురుకుల సొసైటీ వైస్ చైర్మన్ విజయేంద్రబోయి సోమవారం ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేశారు. జేఏసీ నేతలు కొక్కుల యాదయ్య, బాలస్వామి, సైదులు, వసంతరావు, గణేశ్, బాలరాజు, సుధాకర్, సాంబలక్ష్మి తదితరులతో భేటీ అయ్యారు. సమావేశంలో చర్చించాల్సిన పలు సమస్యలపై ఎజెండాను రూపొందించారు. అందులో ప్రధానంగా గురుకులాల్లో వసతి సౌకర్యాలు, శాశ్వతభవనాల నిర్మాణం, వార్డెన్ల నియామకం, స్టాఫ్ ప్యాట్రన్ మార్పులు, జీవో190 అమలు, 317 జీవో బాధితులకు న్యాయం చేయడం తదితర అంశాలను పొందుపరిచారు.
స్టాండింగ్ ఆర్డర్స్ మార్పులకు సంబంధించి అంశాలను పొందుపరచలేదు. కానీ సమావేశానికి గురుకుల ఉపాధ్యాయ సంఘాల జేఏసీ నేతలు హాజరుకాగానే స్టాండింగ్ ఆర్డర్స్లో పొందుపరిచిన మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలు అందజేశారు. సమావేశంలోనూ దీనిపై సొసైటీ ఉన్నతాధికారులు చర్చించలేదు. నామమాత్రంగా అసోసియేషన్లతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సమావేశం అనంతరం సొసైటీ ఉన్నతాధికారులు ఇచ్చిన స్టాండింగ్ ఆర్డర్స్ మార్పు పత్రాలను చూసిన జేఏసీ నేతలు కంగుతిన్నారు. ఇదెక్కడి అన్యాయమని భగ్గుమంటున్నారు. సొసైటీ ఉన్నతాధికారుల ప్రతిపాదనలపై నిప్పులు చెరుగుతున్నారు. 2017నాటి మార్గదర్శకాలను యథావిధిగా అమలు చేయాలని లేదంటే, మరో ఉద్యమానికి శ్రీకారం చుడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు.