మెదక్ : విద్యార్థుల్లో సృజనాత్మక శక్తిని పెంచి, సమాజానికి ఉపయోగపడేవిధంగా వైజ్ఞానిక ప్రయోగాలు చేపట్టాలని మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి సూచించారు. గురువారం జిల్లా కేంద్రంలోని వెస్లీ ఉన్నత పాఠశాలలో జిల్లాస్థాయి వైజ్ఞానిక ప్రదర్శనను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజానికి ఉపయోగపడే విధంగా విద్యార్థుల్లోని నైపుణ్యతను వెలికి తీసే పాత్ర ఉపాధ్యాయులదేనన్నారు.
ప్రయోగాలతో విద్యార్థిని విద్యార్థులలో ఆలోచన శక్తి పెరుగుతుందని ఆమె పేర్కొన్నారు. ప్రతి ఒక్క విద్యార్థి సీవీ రామన్, కలాం, అమర్త్యసేన్ లను ఆదర్శంగా తీసుకొని ముందుకు వెళ్లాలన్నారు. పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా విద్యార్థులు అవకాశాలను అందిపుచ్చుకుని ముందుకెళ్లాలన్నారు.
రాష్ట్రంలో విద్యా, క్రీడల అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ నిధులు కేటాయిస్తున్నారని వివరించారు. ఈ వైజ్ఞానిక ప్రదర్శనలో జిల్లా విద్యాశాఖ అధికారి రమేశ్ కుమార్, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, మండల విద్యాధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.