TS TET | హైదరాబాద్, మార్చి 24 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ ఉద్యోగార్థులకు నిర్వహించే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఫీజులను భారీగా పెంచిన సర్కారు.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ విద్యార్థులకు ఇచ్చే రాయితీని విస్మరించింది. ఆయా వర్గాలకు చెందిన విద్యార్థులపై మోయలేని భారాన్ని మోపింది. రాజ్యాంగసూత్రాలకు విరుద్ధంగా, రిజర్వుడ్ విద్యార్థులకు ఫీజు రాయితీ కల్పించకుండా జనరల్ క్యాటగిరీ విద్యార్థులతో సమానంగా ఒకే తరహా ఫీజులను అమలుచేస్తున్నది. అదే జాతీయంగా నిర్వహిస్తున్న సీటెట్లో ఎస్సీ, ఎస్టీలకు సీబీఎస్ఈ ఫీజు రాయితీని అమలు చేస్తున్నది.
మన రాష్ట్రంలో ఎప్సెట్, ఐసెట్ వంటి ప్రవేశ పరీక్షల్లోనూ ఫీజుల రాయితీని అమలు చేస్తున్నారు. కానీ టెట్లో మాత్రం రాయితీ ఇవ్వడం లేదు. దీనిపై ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన విద్యార్థులు, విద్యార్థి సంఘాల నేతలు మండిపడుతున్నారు. ప్రభుత్వ చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేశారు. ఆదివారం గద్వాల జిల్లాలో టెట్ అభ్యర్థులు ధర్నా నిర్వహించారు. టెట్ ఫీజును తగ్గించాలని, పాత ఫీజుల విధానాన్నే కొనసాగించాలని వారంతా ప్రతినబూనారు.
టెట్ ఫీజులను ఇటీవలే ప్రభుత్వం భారీగా పెంచింది. నిరుడు ఒక పేపర్ రాసినా, రెండు పేపర్లు రాసినా రూ.400 మాత్రమే ఫీజు తీసుకోగా, ఈ ఏడాది ఒక పేపర్కు రూ.1,000, రెండు పేపర్లకు రూ.2,000 ఫీజుగా ఖరారు చేశారు. ఈ ఫీజులు సీబీఎస్ఈ నిర్వహించే సీటెట్తో పోల్చితే 300 శాతం అధికంగా ఉండటం గమనార్హం. సీటెట్కు జనరల్ క్యాటగిరీ అభ్యర్థుల నుంచి ఒక పేపర్కు రూ.1,000, రెండు పేపర్లకు 1,200 మాత్రమే తీసుకుంటున్నారు.
నిరుద్యోగుల నుంచి రూపాయి ఫీజు తీసుకోకుండా దరఖాస్తులు స్వీకరిస్తామని కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో పొందుపరిచింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఫీజుల పేరుతో నిరుద్యోగుల నడ్డి విరుస్తోంది. టెట్ ఫీజుల పెంపు మరీ దారుణం. ఎన్నికల హామీని నిలబెట్టుకొని తక్షణమే రూపాయి ఫీజు లేకుండా దరఖాస్తులు స్వీకరించాలి. లేని పక్షంలో ఆందోళనలు ఉధృతం చేస్తాం.
– జంగయ్య, రాష్ట్ర కార్యదర్శి, బీఆర్ఎస్వీ