దుబ్బాక, డిసెంబర్ 10: పవిత్రమైన ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న వ్యక్తి తాగుబోతుగా మారి, చిన్నారులపై కర్కశత్వాన్ని ప్రదర్శించాడు. మద్యం సేవించి బడికి రావడమే కాకుండా, ఆ మత్తులో విద్యార్థులను చితకబాదాడు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పద్మనాభునిపల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్జీటీ అమ్మన సంజీవ్రెడ్డి శుక్రవారం మద్యం సేవించి పాఠశాలకు వచ్చాడు. మద్యం మత్తులో విద్యార్థులను దూషించడంతోపాటు పాశవికంగా దాడిచేశాడు. 2, 3వ తరగతులకు చెందిన 15 మందిని కర్రతో కొట్టడమే గాక పిల్లల బుగ్గలపై గిచ్చి కర్కశత్వంగా ప్రవర్తించాడు. సాయంత్రం ఇంటికి వెళ్లిన పిల్లల ముఖాలపై గాయాలను చూసి తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. గ్రామస్థులతో కలిసి పాఠశాలకు వెళ్లేసరికి ఆ ఉపాధ్యాయుడు జారుకున్నాడు. చిన్నారులను తిమ్మాపూర్ పీహెచ్సీకి తరలించారు. విషయాన్ని సర్పంచ్ పరశురాములు దుబ్బాక జడ్పీటీసీ రవీందర్రెడ్డి ద్వారా మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆయన సదరు ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకోవాలని డీఈవోకు సూచించారు. డీఈవో ఆదేశాలతో ఎంఈవో ప్రభుదాస్ దవాఖానకు వెళ్లి విద్యార్థుల పరిస్థితిని చూసి చలించిపోయారు. ఉపాధ్యాయుడిపై చర్యలు తీసుకుంటామని ఎంఈవో తెలిపారు.