గోదావరిఖని, జూన్ 24: సింగరేణిలో 40 లక్షల టన్నుల బొగ్గు ఏమైందని, నిల్వలు చూపించడానికి యాజమాన్యం ఎందుకు భయపడుతున్నదని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ప్రశ్నించారు. బొగ్గు ఏమైందని ప్రశ్నిస్తే యాజమాన్యం ఉలిక్కిపడుతున్నదని అన్నారు. అధికారులు వాస్తవాలు వెల్లడించకుండా ఊకదంపుడు ప్రెస్మీట్లు నిర్వహించడం ఎందుకని ప్రశ్నించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. బొగ్గు రవాణాలో లోపాలు ఉన్నాయని, అక్రమ రవాణా జరిగిందని బీఆర్ఎస్ గానీ టీబీజీకేఎస్ ఎక్కడా ఆరోపించలేదని అన్నారు. తాము 40 లక్షల టన్నుల బొగ్గు లెక్కలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నామని తెలిపారు.
అసలు విషయాన్ని పక్కనపెట్టి సంబంధం లేని అంశాలను ప్రస్తావిస్తూ కార్మికులను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించడం సరికాదని అన్నారు. బొగ్గు పక్కదారి పట్టలేదని చెప్తున్న అధికారులు, సంబంధిత బొగ్గు నిల్వల వివరాలను బహిరంగంగా చూపించడానికి సిద్ధంగా ఉన్నారా? అని ప్రశ్నించారు. దీనిపై స్పష్టమైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సంబంధిత బొగ్గు పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు డివిడెంట్లు, పన్నులు, కోల్సెస్, సీఎస్ఆర్, డీఎంఎఫ్ నిధులు, తదితర అంశాల కింద వందల కోట్ల రూపాయలు అడ్వాన్స్ పన్నులు చెల్లించారని పేర్కొన్నారు.
అయినప్పటికీ కొన్ని కార్మిక సంఘాలు యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్నాయని విమర్శించారు. బొగ్గు అంశాన్ని ప్రస్తావిస్తే సింగరేణి ప్రతిష్ట దెబ్బతింటుందని చెప్పడం సరైన విధానం కాదని సూచించారు. సంస్థను ప్రైవేటీకరణ దిశగా తీసుకెళ్లే ప్రమాదాల గురించి తాము మాట్లాడుతున్నామని చెప్పారు. సంస్థ లేకపోతే ప్రతిష్ట అనే ప్రశ్న ఎక్కడ ఉంటుందని ఆయన వాఖ్యానించారు.