హుజూరాబాద్, జూలై 31: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ పట్టణంలోని మహాలక్ష్మీ, వరుణ్ ఇండస్ట్రీస్ యజమాని ప్రభుత్వానికి సీఎంఆర్ బియ్యాన్ని అందజేయకుండా రూ.8 కోట్లు ఎగనామం పెట్టినట్టు టాస్క్ఫోర్స్ అధికారుల తనిఖీల్లో బయట పడింది. సోమవారం పట్టణ శివారులోని ఈ రెండు రైస్ మిల్లుల్లో టాస్క్ఫోర్స్ అధికారులు దాడులు చేపట్టారు. మహాలక్ష్మీ రైస్మిల్లుకు సంబంధించి 2021-2022లో ప్రభుత్వం 32 వేల 61 క్వింటాళ్ల ధాన్యాన్ని ఇచ్చింది. దీనికి సంబంధించి ప్రభుత్వానికి 21 వేల 481 క్వింటాళ్ల బియ్యం ఇవ్వాల్సి ఉండగా, కేవలం 17 వేల 308 క్వింటాళ్లు మాత్రమే ఇచ్చాడు. ఇంకా 4,173 క్వింటాళ్ల బియ్యాన్ని ఇవ్వలేదు. దీని విలువ రూ.81 లక్షల 79 వేలు. 2022-23 వానకాలంలో ప్రభుత్వం 35 వేల 144 క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లర్కు అందించింది. దీనికి సంబంధించి 23 వేల 546 క్వింటాళ్ల బియ్యం ప్రభుత్వానికి అందించాల్సి ఉండగా, ఒక్క గింజ కూడా ఇవ్వలేదు. ఈ సీజన్లో ఇచ్చిన ధాన్యంలో కేవలం 10 వేల 153 క్వింటాళ్ల ధాన్యం మాత్రమే మిల్లులో నిల్వ ఉన్నది. ఇందులో 25 వేల 384 క్వింటాళ్ల లోటు ఉండగా, దీని విలువ రూ.5 కోట్ల 14 లక్షల 80 వేలు ఉంటుందని అధికారులు తెలిపారు. వరుణ్ ఇండస్ట్రీస్లో 2021-22 వానకాలానికి సంబంధించి 40 వేల 893 క్వింటాళ్ల ధాన్యాన్ని ప్రభుత్వం కేటాయించింది. దీనికి సంబంధించి 27 వేల 398 క్వింటాళ్ల బియ్యాన్ని ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉండగా, కేవలం 10 వేల 730 క్వింటాళ్ల బియ్యం మాత్రమే ఇచ్చినట్టు అధికారుల లెక్కల్లో తేలింది. ఇంకా 16 వేల 668 క్వింటాళ్ల బియ్యం ఇవ్వాల్సి ఉంది. ఈ లెక్కన సీఎంఆర్ బియ్యానికి సంబంధించి 24 వేల 296 క్వింటాళ్ల ధాన్యం మిల్లులో నిల్వ ఉండాలి. కానీ, 12 వేల 386 క్వింటాళ్లు మాత్రమే నిల్వ ఉంది. మిగతా ధాన్యం 11 వేల 909 క్వింటాళ్ల ధాన్యానికి ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ.2 కోట్ల 33 లక్షల 42 వేలు ఎగనామం పెట్టాడు. ఈ రెండు రైస్ మిల్లులకు సంబంధించి యజమాని ఒక్కడే కావడం విశేషం. మొత్తానికి రెండు మిల్లుల్లో కలిపి రూ.8 కోట్ల 30 లక్షలు ప్రభుత్వానికి ఇవ్వాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ దాడుల్లో టాస్క్ఫోర్స్ హైదరాబాద్ వింగ్ సివిల్ సప్లయ్ ఓఎస్డీ ఎం ప్రభాకర్, ఎస్సైలు కృష్ణ, జంగయ్య, డీటీ వసంతరావు, ఫుడ్ ఇన్స్పెక్టర్ ఇల్లందుల వినోద్ పాల్గొన్నారు.