హైదరాబాద్: కేంద్రంలోని మోదీ సర్కారు కార్మిక హక్కులను హరిస్తున్నదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. హైదరాబాద్లోని ఎంబీ భవన్లో ఆదివారం మే డే నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని మాట్లాడుతూ.. ఆధునిక భారతదేశంలోనూ రోజుకు 12 గంటలు, 14 గంటలు పని చేయాల్సిన దుస్థితి ఉందన్నారు. ఈ పని గంటలను శాశ్వతంగా అమలు చేసేందుకు చట్టాలు తెచ్చే ప్రయత్నాలు జరుగుతుండడం దారుణమని పేర్కొన్నారు.
మోదీ పాలన.. దేశభక్తులు, అభివృద్ధి కాముకులకు కంటకంగా మారిందని తమ్మినేని వీరభద్రం అభిప్రాయపడ్డారు. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులను రక్షించుకునేందుకు మళ్లీ పోరుబాట పట్టాలని కోరారు. కార్మికవర్గం, శ్రామికజనం, దేశభక్తులు మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించాలనీ, బీజేపీని గద్దెదించాలని పిలుపునిచ్చారు. అప్పుడే దేశానికీ, రాజ్యాంగానికి రక్షణ ఉంటుందని తెలిపారు. ప్రత్యామ్నాయ రాజకీయ విధానంతో ప్రజల్లోకి వెళ్లేందుకు వామపక్షాలు ఏకం కావాలన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు బీ వెంకట్, సీఐటీయూ జాతీయ ఉపాధ్యక్షుడు సాయిబాబు, తదితరులు పాల్గొన్నారు.