హైదరాబాద్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ): మునుగోడులో వామపక్షాలు బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి గెలుపు తెలంగాణ రాజకీయాల్లో మంచి పరిణామమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. తెలంగాణలో పాగా వేసేందుకు బీజేపీ కుట్రపూరితంగా ఉప ఎన్నికను తీసుకొచ్చిందని చెప్పారు. ఈ గెలుపు టీఆర్ఎస్, కమ్యూనిస్టుల ఐక్యతకు నిదర్శనమని తెలిపారు. టీఆర్ఎస్ అధిష్ఠానం పకడ్బందీ వ్యూహాన్ని అనుసరించిందని, టీఆర్ఎస్, కమ్యూనిస్టు పార్టీల శ్రేణులు, నాయకులు గొప్పగా పనిచేశారని ప్రశంసించారు. తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ విస్తరణకు పెద్దగా అవకాశాలులేవని స్పష్టంచేశారు. సహజంగానే చైతన్యవంతమైన తెలంగాణ సమా జం బీజేపీ పట్ల చాలా వ్యతిరేకతతో ఉన్నదని పేర్కొన్నారు. మునుగోడు ఫలితంతో రాబోయే రోజుల్లో బీజేపీ జాతీయ నాయకత్వం మరింత రెచ్చగొట్టే చర్యలకు, కార్యక్రమాలు పాల్పడే అవకాశం ఉంటుందని, తెలంగాణ సమాజం మరింత చైతన్యవంతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో టీఆర్ఎస్తో కమ్యూనిస్టుల మితృత్వం మునుగోడుకే పరిమితం కాదని, భవిష్యత్తులో ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా కొనసాగుతుందని స్పష్టం చేశారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్రెడ్డి ఓట్ల లెక్కింపు అనంతరం ఓటమిని అంగీకరిస్తూనే.. కమ్యూనిస్టులపై నోరు పారేసుకోవడం ఆయనలోని అహంకారాన్ని, అక్కసును తెలియజేస్తున్నదని విమర్శించారు.
ఈ ఓటమి మోదీదే: నారాయణ
మునుగోడులో బీజేపీ ఓటమి రాజగోపాల్రెడ్డిది కాదని, ఆ ఓటమి ప్రధాని మోదీదే అని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్ కే నారాయణ పేర్కొన్నారు. ‘మునుగోడు ఉప ఎన్నికలో సీపీఐ, సీపీఎం అనుసరించిన విధానం సరైనదని ఫలితం నిరూపించింది. వామపక్షాలు బలపరిచిన టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించినందుకు మునుగోడు ఓటర్లకు అభినందనలు’ అంటూ నారాయణ ట్వీట్ చేశారు.