తాడ్వాయి, మార్చి19: గతంలో తెలంగాణ ప్రాంతం నీళ్లు లేక ఎడారిలా ఉండేదని.. సీఎం కేసీఆర్కు నీటిపై ఉన్న అవగాహన, ఇస్తున్న ప్రాధాన్యం వల్ల నేడు ఎటుచూసినా పచ్చగా కనిపిస్తున్నదని ఆంధ్రప్రదేశ్ స్పీకర్ తమ్మినేని సీతారాం పేర్కొన్నారు. ములుగు జిల్లా మేడారంలోని సమ్మక్క-సారమ్మను ఆయన కుటుంబ సమేతంగా దర్శించుకొని, తన ఎత్తు బెల్లాన్ని అమ్మవార్లకు సమర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో మహాజాతర అంగరంగ వైభవంగా జరిగిందని కితాబిచ్చారు. తాను ఎప్పటినుంచో మేడారాన్ని దర్శించుకోవాలని అనుకున్నానని, ఇన్నాళ్లకు తల్లుల ఆజ్ఞతో ఇక్కడికి వచ్చానని చెప్పారు. సమ్మక్క-సారలమ్మను దర్శించుకోవడం పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. గతంలో మేడారంలో కనీస సౌకర్యాలు లేవని, సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో ప్రస్తుతం బాగా అభివృద్ధి చెందిందని ప్రశంసించారు. భక్తుల కోసం శాశ్వత నిర్మాణాలు చేపట్టడంపై కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ వచ్చిన తర్వాత పుష్కలంగా సాగు, తాగునీటి సౌకర్యాలు పెరిగాయని చెప్పారు. అనంతరం రామప్ప వెళ్లి రామలింగేశ్వరుడిని దర్శించుకున్నారు. రామప్పకు ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు లభించడం గర్వకారణమని, ఇంతటి గొప్ప కట్టడం గురించి పూర్తిగా తెలుసుకునేందుకు మరోసారి సందర్శించాలని ఉందని చెప్పారు.