జూబ్లీహిల్స్, జనవరి 21: తెలంగాణలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా దళితుల అభ్యున్నతికి జరుగుతున్న కృషి ప్రశంసనీయమని తమిళనాడు వీసీకే పార్టీ శాసనసభ్యులు కొనియాడారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో దళితుల కోసం అమలవుతున్న పథకాలు అద్భుతంగా ఉన్నాయని కితాబిచ్చారు. శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని రహమత్నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్లోగల సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ (సీడీఎస్)ను ఆ పార్టీ ఫ్లోర్ లీడర్, కట్టుమర్నకోయిల్ శాసనసభ్యుడు ఎస్ సెల్వన్, తిరుపోరూర్ శాసనసభ్యుడు ఎస్ఎస్ బాలాజీతోపాటు పలువురు అధికారులు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధుల బృందం సందర్శించింది.
తెలంగాణలో దళితుల కోసం అమలవుతున్న పథకాలపై అధ్యయనం చేసింది. దళితబంధులాంటి మహోన్నతమైన పథకాలతో తెలంగాణ ఆదర్శంగా నిలిచిందని బృందం కొనియాడింది. 6 అంతస్థుల భవనం, 27 అడుగుల ఎత్తైన అంబేద్కర్ విగ్రహంతో సెంటర్ ఫర్ దళిత్ స్టడీస్ తెలంగాణలో దళితుల అభ్యున్నతికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నదని ప్రశంసించింది. దళితుల సంక్షేమం కోసం తెలంగాణతరహా పతకాలను తమ రాష్ట్రంలోనూ ప్రవేశపెట్టేందుకు శాసనసభ వేదికగా తమవంతు కృషి చేస్తామని బృందం సభ్యులు పేర్కొన్నారు. సీడీఎస్ చైర్పర్సన్ డాక్టర్ మల్లేపల్లి లక్ష్మయ్య, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కాకి మాధవరావు, సీనియర్ సంపాదకుడు రామచంద్రమూర్తి, చెన్నై కార్నర్ స్టోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ రిచర్డ్ దేవదాస్, త్రివేండ్రం ఎస్ఏఎస్వై స్టేట్ కో ఆర్డినేటర్ మురుగప్పన్, ఈడీ డాక్టర్ వీఏ రమేశ్నాథన్, తమిళనాడు సోషల్ వాచ్ ఈడీ కుమార్, ప్రతినిధుల బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.