హైదరాబాద్, సెప్టెంబర్ 7(నమస్తే తెలంగాణ): తెలంగాణలో మాదిరిగానే తమిళనాడులో కూడా టీహబ్ను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉన్నదని పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ (ఐటీ) సభ్యుడు కార్తి పీ చిదంబరం పేర్కొన్నారు. హైదరాబాద్లో ఐటీరంగానికి ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించడం లో సీఎం కేసీఆర్ ఎంతో కృషిచేస్తున్నారని ప్రశంసించారు. ఎంపీ శశిథరూర్ నేతృత్వంలో స్టాండింగ్ కమిటీ సభ్యులు కార్తి పీ చిదంబరం, తేజస్విసూర్య, చందన్సింగ్, మహువా మైత్రా, గల్లా జయదేవ్, రంజిత్రెడ్డి మంగళవారం టీ హబ్ను సందర్శించారు. క్యాంపస్ ను పరిశీలించి, స్టార్టప్ల నిర్వాహకులతో చర్చించా రు. టీ హబ్ ద్వారా అందుతున్న మద్దతుపై వివరాలడిగారు. అనంతరం కార్తి చిదంబరం ట్విట్టర్ ద్వారా సంతోషాన్ని పంచుకున్నారు. ‘టీ హబ్ ప్రత్యేక ఆకర్షణగా ఉన్నది. ఇది గొప్ప చొరవ. ఇలాంటిది తమిళనాడులో తప్పనిసరిగా ఏర్పాటుచేయాలి. టీ హబ్ బృందంతోపాటు అక్కడి స్టార్టప్ల ప్రతినిధులతో మాట్లాడటం వల్ల కొత్త విషయాలు తెలుసుకున్నాం’ అని ట్వీట్ చేశారు. రాష్ట్ర ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్ స్టాండింగ్ కమిటీకి ప్రభుత్వం తరుపున స్వాగతం పలికి టీ హబ్ గురించి వివరించారు. ఈ కమిటీ 3 నుంచి 10వ తేదీ వరకు శ్రీనగర్, ముంబై, హైదరాబాద్, చన్నై నగరాల్లో పర్యటిస్తున్నది.