హైదరాబాద్, జనవరి 3 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ అద్దెబస్సుల యాజమాన్యాలతో గురువారం ప్రభుత్వం చర్చలు జరపనుంది. ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల తాము తీవ్రంగా నష్టపోతున్నామని ఆర్టీసీ అద్దె బస్సు ల యాజమాన్యాలు సమ్మెకు పిలుపునిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. ఈ మేరకు బుధవారం టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అద్దెబస్సుల యాజమాన్యాల సంఘం ప్రతినిధులకు ఫోన్ చేసి చర్చలకు ఆహ్వానించారు. దీంతో సంఘం ప్రతినిధులు ప్రభుత్వం ముందు రెండు డిమాండ్లను ఉంచారు. దీనిపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేస్తున్నది. ఈ చర్చ ల్లో తమకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే 5 నుంచి తాము తలపెట్టిన సమ్మెను వాయిదా వేస్తామని, లేనిపక్షంలో సమ్మెను యథావిథిగా కొనసాగిస్తామని తేల్చిచెప్పారు.