హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): బీజేపీది నీచమైన రాజకీయమని పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో శుక్రవారం ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే ముఠా గోపాల్తో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు. రాంగోపాల్పేట అగ్నిప్రమాదంపై కేంద్రమంత్రి కిషన్రెడ్డి బాధ్యతారాహిత్యంగా మాట్లాడారని, ఆయన టూరిస్ట్గా ఇక్కడికి వచ్చి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆరోపించారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టిందని, అన్ని ప్రభుత్వ శాఖలు ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు చొరవ చూపాయని వివరించారు.
సహాయక చర్యల్లో పాల్గొన్న అగ్నిమాపక సిబ్బందికీ గాయాలయ్యాయని చెప్పారు. ప్రమాదం జరిగిన భవనం నాణ్యతపై నిట్ ఆధ్వర్యంలోని కమిటీ అధ్యయనం చేస్తుందని, ఈ నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. హైదరాబాద్లో అక్రమ కట్టడాల విషయంలో ఈనెల 25న సంబంధిత శాఖలతో ఉన్నతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేస్తామని, అవసరమైతే అఖిలపక్షం కూడా ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. అక్రమ కట్టడాలను డబ్బుల కోసమే ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తుందని కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఆయన తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో 2008 నుంచి బీఆర్ఎస్ (బిల్డింగ్ రెగ్యులరైజేషన్ స్కీమ్) కోర్టు కేసులో ఆగిపోయిందన్న కనీస ఇంగితం లేకుండా కిషన్రెడ్డి మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో దాదాపు 15 ఏళ్లుగా ఏ ఒక్క అక్రమ కట్టడమైనా క్రమబద్ధీకరణ జరిగితే దాని వివరాలు చెప్పాలని డిమాండ్ చేశారు. కిషన్రెడ్డిది అవగాహనా రాహిత్యమని దుయ్యబట్టారు.