చిట్యాల, ఆగస్టు 28: భూమిని ప్రేమిస్తే తల్లిదండ్రులను ప్రేమించినట్టేనని, భూమి ఉన్నవారంతా రోజూ కనీసం గంటసేపైనా వ్యవసాయ పనులు చేయాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. శనివారం నల్లగొండ జిల్లా శాలిగౌరారం పర్యటనకు వెళ్తూ చిట్యాలలో కొంతం సత్తిరెడ్డి వంగ తోటను మంత్రి పరిశీలించారు. ఏ రకం పంట వేశారు.. ?, ఎంత దిగుబడి వస్తుంది..?, పంటను ఎక్కడ మార్కెట్ చేస్తున్నారని ఆరా తీశారు. విరివిగా కాసిన వంకాయలను చూసి సాగు విధానాలను అడిగి తెలుసుకున్నారు. చేనులో కనిపించిన వయ్యారి భామ కలుపు మొక్కలను స్వయంగా తొలగించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ రాజకీయాలు, వ్యాపారాలు వ్యాపకమేదైనా భూములున్న వారంతా వ్యవసాయం చేయాలని, భూమిని పడావు పెట్టవద్దని కోరారు. తన కూతురు భూమి మొత్తం నాపరాళ్లతో నిండి ఉంటే.. కొంత మేర తొలగించి వేరే మట్టి నింపి సాగు చేస్తే అద్భుతమైన దిగుబడి వస్తుందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దూరదృష్టితో వ్యవసాయానికి ఇస్తున్న ప్రాధాన్యత వల్ల తెలంగాణలో విస్తారంగా సాగు వనరులు పెరిగాయన్నారు. అనంతరం మార్కెట్ రేటు చెల్లించి 20 కిలోల వంకాయలను మంత్రి కొనుగోలు చేశారు. మంత్రి వెంట చిట్యాల మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి చినవెంకట్రెడ్డి, వైస్ చైర్మన్ కూరెళ్ల లింగస్వామి, నార్కట్పల్లి ఎంపీపీ నరేందర్రెడ్డి, నాయకులు ఉన్నారు.