హైదరాబాద్ : మహిళలు స్వయం ఉపాధి అవకాశాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. గురువారం జగిత్యా జిల్లా ధర్మపురిలోని ఎస్ హెచ్ గార్డెన్స్ వేదికగా ఎస్సీ కార్పొరేషన్, స్టార్ మహిళ మండలి ద్వారా శిక్షణ పొందిన 69 మంది లబ్ధిదారులకు సర్టిఫికెట్, 10 లక్షల 35 వేల రూపాయల విలువ గల కుట్టు మిషన్లు, ఒక్కొక్కరికి 50 వేల రూపాయల చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మహిళలు ప్రభుత్వం అందిస్తున్న శిక్షణ పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకుంటూ నైపుణ్యం సాధించాలని తెలిపారు. కార్పొరేషన్ ద్వారా శిక్షణ పొందిన మహిళలకు వివిధ ఏజెన్సీల ద్వారా ఉపాధి సైతం అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
జగిత్యాల జిల్లాలో ఉన్న ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలోచదువుతున్న విద్యార్థులకు అవసరమైన దుస్తులను తయారు చేసే బాధ్యతను మహిళలకు అందిస్తామని మంత్రి తెలిపారు. మహిళలకు కుట్టుమిషన్లతో పాటు 20 మంది లబ్ధిదారులకు 10 లక్షల 68 వేల 700 రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వాచెక్కులను లబ్ధిదారులకు మంత్రి పంపిణీ చేశారు.
కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రవి, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ సంగి సత్తమ్మ, ఎంపీపీ ఎడ్ల చిట్టి బాబు, జెడ్పీటీసీ బత్తిని అరుణ, మాజీ మార్కెట్ చైర్మన్ అయ్యోరి రాజేష్, వైస్ ఎంపీపీ గడ్డం మహిపాల్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.