హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): ప్రజాప్రతినిధుల గౌరవానికి భంగం కలిగించేలా అనుచిత వ్యాఖ్యలు చేసిన వైఎస్ షర్మిలపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు శాసనసభ్యులు స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి విజ్ఞప్తి చేశారు. మహబూబ్నగర్ పర్యటనలో షర్మిల పలువురు శాసనసభ్యులపై అభ్యంతరకర వ్యాఖ్యలుచేశారని వారు సభాపతి దృష్టికి తీసుకువచ్చారు. శాసనసభ్యులను ఎవరైనా అసభ్యపదజాలంతో దూషించినా, అగౌరవపరిచినా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. శాసనసభ్యులు సీ లక్ష్మారెడ్డి, కాలె యాదయ్య, ఆల వెంకటేశ్వర్రెడ్డి తదితరులు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డిని మంగళవారం ఆయన చాంబర్లో కలిసి వినతిపత్రం అందజేశారు. శాసనసభ్యుల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత స్పీకర్గా తనపై ఉన్నదని, ఈ విషయాన్ని అన్ని కోణాల్లో విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి తనను కలిసిన ప్రజాప్రతినిధులకు తెలిపారు.