కరీంనగర్ విద్యానగర్, డిసెంబర్ 16: రానున్న లోక్సభ ఎన్నికల్లో బండి సంజయ్ పోటీ చేయకుండా మోకాలడ్డే ప్రయత్నం చేస్తున్న పార్టీ సీనియర్లపై చర్యలు తీసుకోవాలని బండి మద్దతుదారులు బీజేపీ అధిష్ఠానాన్ని కోరారు. కరీంనగర్లోని ఈఎన్ గార్డెన్లో శనివారం పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ పదాధికారుల సమావేశం నిర్వహించారు. కరీంనగర్, వేములవాడ జిల్లాల అధ్యక్షులతోపాటు రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమదేవి సహా మండల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఆ పైస్థాయి నాయకులంతా హాజరయ్యారు.
ఈ సందర్భంగా బండి మద్దతుదారులు మాట్లాడుతూ.. గురువారం కరీంనగర్లోని ఓ హోటల్లో బండి సంజయ్ వ్యతిరేకులు సమావేశమైన విషయాన్ని ప్రస్తావించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ నుంచి బండికి పోటీచేసే అవకాశం ఇవ్వొద్దని అధిష్ఠానాన్ని కోరుతూ వారు ఏకగ్రీవ తీర్మానం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకమాండ్ వారిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. బండి అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకించేవారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
పార్లమెంటు ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చు
ఇదే సమావేశంలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యద ర్శి, ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ.. పార్లమెం ట్ ఎన్నికలు ఎప్పుడైనా వచ్చే అవకాశం ఉన్నదని, అందుకు సిద్ధంగా ఉండాలని కార్యకర్తలు, నాయకులను అప్రమత్తం చేశారు. దేశవ్యాప్తంగా బీజేపీ గాలి వీస్తున్నదని, ఈసారి 350 స్థానాలతో మూడోసారి మోదీ అధికారంలోకి వస్తారని సర్వేలు చెబుతున్నాయని పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్టీపరంగా చేపట్టాల్సిన కార్యక్రమాలను వివరించా రు. తెలంగాణలోనూ మోదీ గాలి వీస్తున్నదని బీజేపీ, కాంగ్రెస్ మధ్యే ప్రధానంగా పోటీ ఉంటుందని వివరించారు. మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ఇంటింటికీ తీసుకెళ్లాలని సూచించారు. బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రతి ఒక్కరు పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.