రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 4(నమస్తే తెలంగాణ) : ఓ అధికారి రామాలయాన్ని కాంగ్రెస్ నేతకు రాసిచ్చిన ఘటనపై అటు అధికారులు, ఇటు అధికార పార్టీ నేతల్లో అలజడి సృష్టించింది. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజుపల్లిలోని సీతారామాంజనేయస్వామి దేవాలయ ఆస్తి విషయమై శనివారం ‘నమస్తే తెలంగాణ’లో ‘కాంగ్రెస్ నేతకు రామాలయం రాసిచ్చిండ్రు’ శీర్షికన ప్రచురితమైన కథనం అధికారులను హడలెత్తించింది. ఈ కథనంపై అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్ స్పందించారు. శ్రీ సీతారామాంజనేయ ఆలయంపై సర్టిఫికెట్ జారీని పరిశీలించి, విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకవెళ్లి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని ‘నమస్తే’కు తెలిపారు.
‘నమస్తే’ కథనం, కాంగ్రెస్ నేత నిర్వాకం, అధికార దుర్వినియోగం వంటి అంశాలు జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇదిలావుండగా సర్టిఫికెట్ జారీ విషయమై సదరు తహసీల్దార్ కార్యాలయంలోని అధికారులు, సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఈ సమాచారం బయటకు ఎలా వెళ్లిందని వారిపై రుసరుసలాడినట్టు సమాచారం. సదరు కాంగ్రెస్ నేత కూస రవీందర్ పెట్టుకున్న అర్జీని పంపియ్యాలని ఆర్డీవో రాధాబాయి ఆదేశించినట్టు తెలిసింది. కాంగ్రెస్ నాయకుడు రవీందర్కు ఎలా సర్టిఫికెట్ జారీ చేస్తారని అధికారులపై సొంత పార్టీ నేతలే కొందరు మండిపడినట్టు విశ్వసనీయ సమాచారం.
తమ గ్రామంలోని శ్రీ సీతారామాంజనేయ స్వామి దేవాలయాన్ని పంచాయతీ ఆస్తిగా గుర్తించాలని, కాంగ్రెస్ నాయకుడికి కట్టబెడుతూ అక్రమంగా జారీచేసిన సర్టిఫికెట్ను తక్షణమే రద్దు చేయాలని బోయినపల్లి మండలం నీలోజులపల్లి సర్పంచ్ అనుముల భాస్కర్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతోపాటు స్థానికులు డిమాండ్ చేశారు. వీరంతా శనివారం కలెక్టర్కు తరలివచ్చారు. కలెక్టర్ అందుబాటులో లేకపోవడంతో అదనపు కలెక్టర్ గడ్డం నగేశ్కు ఫిర్యాదుచేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.