హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 1 (నమస్తే తెలంగాణ): భూమిలో విత్తనం నాటడం మొదలు.. ఆకాశంలోకి రాకెట్ను పంపే వరకు అవసరమైన వస్తువుల ఆవిష్కరణలు టీ-వర్క్స్లో తయారయ్యేందుకు వీలుగా అవసరమైన మౌలిక వసతులు కల్పిస్తున్నామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. దేశంలోనే అతిపెద్ద ప్రొటోటైపింగ్ కేంద్రంగా నిర్మించిన టీ-వర్క్స్ను బుధవారం మంత్రి పరిశీలించి, దాని ఆవశ్యకతను మీడియాకు వివరించారు. సాఫ్ట్వేర్లో టెక్నాలజీ ఆవిష్కరణలకు కేంద్రంగా మారిన టీ-హబ్ తరహాలో, హార్డ్వేర్ రంగంలో సరికొత్త వస్తువుల ఆవిష్కరణలు రూపొందించే కేంద్రంగా టీ-వర్క్స్ను అందుబాటులోకి తీసుకొస్తున్నామని తెలిపారు. రాయదుర్గం ఐటీ కారిడార్లో ఒకే చోట సుమారు 18 ఎకరాల్లో టీ-హబ్, టీ-వర్క్స్, ఇమేజ్ టవర్ను ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. వీటిని రాష్ట్ర ప్రభుత్వమే పూర్తిస్థాయిలో నిధులు వెచ్చించి ప్రజల కోసం తీసుకొస్తున్నదని చెప్పారు. టీ-వర్క్స్ను గురువారం ప్రపంచ దిగ్గజ తయారీ సంస్థ ఫాక్స్కాన్ కంపెనీ చైర్మన్ యంగ్లూ ప్రారంభించనున్నారని వెల్లడించారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి ప్రభుత్వ, ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) విధానంలో నిర్మిస్తున్న ఇమేజ్ టవర్ అందుబాటులోకి వస్తుందని వివరించారు.
ఉత్పత్తుల ఆవిష్కరణలో దేశంలోనే అగ్రగామిగా నిలిచేలా టీ-వర్క్స్ను ప్రభుత్వం డిజైన్ చేసిందని, దైనందిన జీవితంలో అవసరమయ్యే వస్తువులను వినూత్నంగా తయారు చేయాలన్న ఆలోచన ఉన్నవారు టీ-వర్క్స్కు వస్తే, వారి ఆలోచనలకు అనుగుణంగా వస్తువులను తయారు చేసుకొనే అవకాశం కల్పిస్తామని మంత్రి కేటీఆర్ చెప్పారు. ఇందుకు ఇప్పటివరకు 200కు పైగా అత్యాధునిక యంత్రాల కోసం రూ.110 కోట్లు వెచ్చించామని, మరో రూ.40 కోట్ల వరకు కార్పొరేట్ సంస్థల నుంచి వచ్చే అవకాశం ఉన్నదని వివరించారు. టీ-వర్క్స్ మొదటి దశ 78 వేల చదరపు అడుగుల్లో ఉన్నదని, ఇందులోనే ఉత్పత్తుల రూపకల్పన, ఇంజినీరింగ్, ఫ్యాబ్రికేషన్, సోర్సింగ్, మెటీరియల్స్, ఇతర అంశాలపై టీ-వర్క్స్లో నిపుణులు అందుబాటులో ఉండి ఆవిష్కర్తలకు సహకరిస్తారని తెలిపారు.
టీ-హబ్ తరహాలోనే టీ-వర్క్స్ను అందుబాటులోకి తీసుకొచ్చి, స్వయం సమృద్ధి సాధించేలా తీర్చిదిద్దుతామని మంత్రి కేటీఆర్ చెప్పారు. పిల్లలు చిన్నప్పటి నుంచే డిజైన్ థింకింగ్ అలవర్చుకోవాలని, మేధస్సుకు పదును పెడితే మంచి ఆలోచనలు వస్తాయని సూచించారు. టాలెంట్ ఏ ఒక్కరి సొంతం కాదని, పట్టణాల నుంచే కాకుండా గ్రామీణ ప్రాంతాల నుంచి ఆవిష్కర్తలను గుర్తించి వారిని ఇక్కడికి తీసుకొస్తున్నామని, ఇందుకు ప్రత్యేక ఉదాహరణ వరంగల్కు చెందిన రాజేంద్రప్రసాద్ అని చెప్పారు. అతను గోకార్టింగ్ కోసం వినియోగించేలా ఒక ఎలక్ట్రిక్ కారును రూపొందించారని, సూర్యాపేట జిల్లాకు చెందిన జీ అశోక్ వ్యవసాయరంగంలో ఉపయోగించే పలు రకాల పనిముట్లను ఎంతో వినూత్నంగా తయారు చేస్తున్నారని మెచ్చుకొన్నారు. గద్వాలకు చెందిన పాఠశాల విద్యార్థిని వేరుశనగ పొట్టు బయో ప్లాట్ రూపొందించేందుకు టీ-వర్క్స్ తోడ్పడనున్నదని తెలిపారు.
ఐటీ కారిడార్లో ప్రభుత్వం 18 ఎకరాల్లో టీ-హబ్, టీ-వర్క్స్, ఇమేజ్ టవర్ను ఏర్పాటు చేస్తున్నదని మంత్రి కేటీఆర్ చెప్పారు. వీటిలో టీ-హబ్, టీ-వర్క్స్ అందుబాటులోకి రాగా, యానిమేషన్, గేమింగ్, మల్టీమీడియా రంగాల్లో ఆవిష్కరణల కోసం నిర్మిస్తున్న ఇమేజ్ టవర్ను ఈ ఏడాది డిసెంబర్నాటికి పూర్తి చేస్తామని పేర్కొన్నారు. ఇలా ఒకే చోట మూడు వేదికలు ఏర్పాటు కావడం వల్ల ఇవి ప్రపంచంలోనే అతి పెద్ద ఇన్నోవేషన్ కేంద్రంగా మారుతాయన్నారు. టీ-హబ్ 5.7 లక్షల చదరపు అడుగులు, టీ-వర్క్స్ ప్రస్తుతం 78 వేలు చదరపు అడుగులు ఉండగా, భవిష్యత్తులో 2.5 లక్షల చదరపు అడుగులు, ఇమేజ్ టవర్లో 1.16 చదరపు అడుగుల విస్తీర్ణంతో కూడిన స్థలం అందుబాటులోకి రాన్నున్నదని చెప్పారు. ఇలా మొత్తం 9 లక్షలకు పైగా చదరపు అడుగుల స్థలం ప్రభుత్వ పరంగా ఆవిష్కరణ వ్యవస్థల కోసమే అందుబాటులోకి తీసుకొస్తున్నామని వెల్లడించారు.