హైదరాబాద్ : స్థానిక సంస్థలు, గ్రామీణ ప్రజల సమస్యల పరిష్కరానికి టీ – ఇన్నోవేషన్(T-Innovation) దోహద పడుతుందని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli) అన్నారు. తెలంగాణ పల్లెల్లో ఇన్నోవేషన్ను ప్రోత్సహించేందుకు టీఎస్ఐసీ ద్వారా టీ-ఇన్నోవేషన్ మహోత్సవ్ పోస్టర్(Poster)ను ఆదివారం హైదరాబాద్ తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ సీఎం కేసీఆర్(CM KCR) మార్గనిర్దేశం, మంత్రి కేటీఆర్(Minister KTR) చొరవతో తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ వినూత్న ఆలోచనలతో ముందుకు వెళ్లడం సంతోషమన్నారు. ప్రపంచ సృజనాత్మక, ఆవిష్కరణ దినోత్సవం ఏప్రిల్ 21 సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నందుకు సంబంధిత శాఖను మంత్రి అభినందించారు.
గ్రామీణ ప్రాంతాల్లో సామాజిక సమస్యలు, అభివృద్ధికి ఆటంకాలు, ప్రజల ఆలోచనల్లో రావాల్సిన మార్పులపై దృష్టి సారించి వారి జీవన ప్రమాణాల మెరుగుదలకు పాటు పడాల్సిన అవసరం ఉందన్నారు. ముందుగా సమస్యలను అధ్యయనం చేసి, తర్వాత వారితో చర్చించి, నూతన పరిష్కారాలు కనుగొనాలని సూచించారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కార్యదర్శి సదీప్ కుమార్ సుల్తానియా మాట్లాడుతూ అట్టడుడు ప్రజల సమస్యలకు అత్యాధునిక సాంకేతిక పరిష్కారాలు కొత్త ఆవిష్కరణలకు దారి చూపుతాయన్నారు. ఇందుకు అవసరమైన సహాయ, సహకారాలు అందిస్తామని అన్నారు.తెలంగాణ సీఐవో డాక్టర్ శాంత తౌటం తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.