మహబూబ్నగర్ : జిల్లా కేంద్రంలోని ఈద్గా వద్ద రంజాన్ పండుగ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆయన కొత్తగంజ్ సమీపంలో ఉన్న ఈద్గాను సందర్శించారు. రంజాన్ పండుగకు చేయాల్సిన ఏర్పాట్లపై పర్యవేక్షించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో మంత్రి మాట్లాడుతూ.. మహబూబ్ నగర్లో హిందూ, ముస్లింలు కలిసి మెలిసి పండుగలు నిర్వహించుకునే సంస్కృతి ఉందని అన్నారు.
ఎంతో మంది మైనార్టీలు అయ్యప్ప భక్తులకు భోజనం ఏర్పాటు చేయటం, పండ్ల పంపిణీ వంటివి ఏర్పాటు చేస్తారని గుర్తు చేశారు. అదేవిధంగా రంజాన్ మాసంలో అనేక మంది హిందువులు ముస్లింలకు ఇఫ్తార్ విందు వంటివి ఏర్పాటు చేసే సంస్కృతి ఉందన్నారు. ఏక్తా కమిటీని ఏర్పాటు చేసి, కమిటీ ఆధ్వర్యంలోని మతాల పండగలు కలిసి నిర్వహించుకుంటూన్నారని మంత్రి తెలిపారు. రంజాన్ పండుగ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని, ముఖ్యంగా శానిటేషన్, తాగునీరు వంటివి చూడాలని మున్సిపల్ కమిషనర్ ను ఆదేశించారు.
శాంతిభద్రతల విషయంలో కూడా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.
మంత్రి వెంట మున్సిపల్ చైర్మన్ కె.సి. నరసింహులు, కౌన్సిలర్లు నరసింహులు, జాకీర్, మార్కెట్ కమిటీ చైర్మన్ మహ్మద్ అబ్దుల్ రహమాన్, రఫీక్ పటేల్, జాకీ, జబ్బార్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్ తదితరులు ఉన్నారు.