1857 కంటే చాలాకాలం ముందే హైదరాబాద్లో సైనిక తిరుగుబాటు జరిగింది. 1806లో హైదరాబాద్లోని ఈస్టిండియా కంపెనీ పటాలంలో ఇది తలెత్తింది. దేశీయ సైనికులు తమకిచ్చిన కొత్త యూనిఫాంలు నచ్చలేదంటూ తిరుగుబాటు చేశారు. పైకి ఇది తేలికైన కారణంతో జరిగినా దీనివెనుక గూడుకట్టుకున్న బ్రిటిష్ వ్యతిరేకత ఉంది.
యూనిఫారాలు నచ్చలేదంటూ సైనికులు తిరగబడటం అప్పట్లో ఓ సంచలనం. నిజానికి ఇలాంటి నిరసనలు హైదరాబాద్ సంస్థానానికే పరిమితం కాదు. బళ్లారి, బెంగుళూరు, నందిదుర్గ్ కంటోన్మెంట్లలో కూడా ఇదే తరహా తిరుగుబాట్లు జరిగాయి. సికింద్రాబాద్ కంటోన్మెంట్లోని స్వదేశీ సైనికులు తమ శిబిరాన్ని వదిలిపెట్టి నిజాం అధికారులైన రాజారావ్ రంభ నింబాల్కర్, నూరుల్ ఉమ్రాల అండన చేరారు. కొత్తగా ప్రవేశపెట్టిన యూనిఫాం నచ్చకపోవడం అనేది చిన్న విషయంగా కనిపించవచ్చు. కానీ బ్రిటిష్ కంటోన్మెంట్ను ఈ సంఘటన కుదిపివేసింది.
కొత్త యూనిఫాం తమను క్రైస్తవులుగా మార్చేందుకు ఉద్దేశించిందని సైనికులు భావించడంతో గొడవ మొదలైంది. అయితే అనతికాలంలోనే రెసిడెంటు ఈ తిరుగుబాటును దారుణంగా అణచివేశాడు. అంతేకాదు సైనికులలో అవిధేయతను రెచ్చగొట్టారంటూ నింబాల్కర్, నూరుల్ ఉమ్రాలపై చర్య తీసుకోవాలని నిజాంపై రెసిడెంట్ ఒత్తిడి తెచ్చాడు. ఫలితంగా ఇద్దరిని ప్రభుత్వ పదవుల నుంచి తొలగించి ప్రవాస శిక్ష విధించారు. నైజాం ప్రాంత స్వాతంత్య్ర పోరాటంలో త్యాగాలకు ఆ విధంగా నాంది జరిగింది.