దేశ స్వాతంత్య్రోద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సందర్భమది. 1931లో మహారాష్ర్టలోని నాగ్పూర్కు దగ్గరలోని చాందా ప్రాంతంలో గాంధీజీ సమావేశం నిర్వహించారు. ఆ సమావేశానికి వెళ్లొద్దని ఇక్కడి సర్కారు ఆంక్షలు విధించింది. స్వాతంత్య్ర కాంక్ష మెండుగా ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ వాటిని పట్టించుకోలేదు. మహాత్ముడి సమావేశానికి హాజరై స్వాత్రంత్య్రోద్యమ స్ఫూర్తిని నింపుకొని విజయవంతంగా తిరిగొచ్చారు.
కొండా లక్ష్మణ్ బాపూజీ ప్రముఖ స్వాతంత్య సమరయోధుడు. కొమరంభీం జిల్లా వాంకిడి గ్రామంలో 1915 సెప్టెంబర్ 27న జన్మించారు. మూడేళ్ల వయస్సులోనే బాపూజీ తల్లిని కోల్పోయారు. ఆసిఫాబాద్లో ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేశారు. హైదరాబాద్లో న్యాయశాస్త్ర విద్యనభ్యసించారు. 1940లో న్యాయవాద వృత్తి చేపట్టారు. బాపూజీ అణగారిన వర్గాలకు ‘భీష్మ పితామహుడి’గా పేరొందారు.
1931లో మహారాష్ర్టలోని నాగపూర్కు దగ్గరలోని చాందా ప్రాంతంలో నిర్వహించిన గాంధీజీ సమావేశానికి కొండా లక్ష్మణ్ బాపూజీ అప్పటి సర్కారు ఉత్తర్వులను ధిక్కరించిమరీ పాల్గొన్నారు. ఆ సమావేశం తర్వాత భారత స్వాతంత్య్ర పోరాటంపట్ల ఆకర్షితులయ్యారు. భారత జాతీయోద్యమంలో భాగంగా మొట్టమొదటిసారి 1938లో బాపూజీ అరెస్టయ్యారు. 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. స్వాతంత్రోద్యమంలో పాల్గొనేలా ప్రజలను చైతన్యపరిచారు. హైదరాబాద్ సంస్థానంలో స్వాతంత్య్రం కోసం జరిగిన అనేక ఉద్యమాలకు ఆయన నాయకత్వం వహించారు.
గాంధీజీ మొదలుపెట్టిన హరిజనోద్ధరణ కార్యక్రమంలో కొండా లక్ష్మణ్ బాపూజీ పూర్తి స్థాయిలో పాలు పంచుకున్నారు. నాటి ఆంధ్ర మహాసభ నాయకుడు రావి నారాయణరెడ్డి అధ్యక్షులుగా ఉన్న హరి జన సేవాసంఘం హైదరాబాద్ కార్యదర్శిగా చురుకైన పాత్ర పోషించారు. 1958లో సచివాలయం సమీపంలో హుస్సేన్ సాగర్ తీరాన (ప్రస్తుత నెక్లెస్ రోడ్డుపై) భూమి కొని జలదశ్యం నిర్మించుకున్నారు. 97 ఏళ్ల వయసులో 2012 సెప్టెంబరు 21న ఆయన కన్నుమూశారు. మరుసటిరోజు జలదశ్యంలోనే ఆయన అంత్యక్రియలు జరిగాయి.