ఆయన సంపన్న కుటుంబంలో జన్మించారు. మిషనరీ యాత్రలో భాగంగా భారత్కు వచ్చారు. ఇక్కడ బ్రిటిషర్ల కుటిలపాలనలో కుదేలవుతున్న భారత్ను చూసి చలించిపోయారు. తన మాతృదేశం, ఆస్తిపాస్తులనూ వదులుకుని భారత స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్నారు. ఉద్యమంలో భాగంగా అరెస్టయ్యారు శామ్యూల్ స్టోక్స్ ఉరఫ్ సత్యానంద స్టోక్స్. ఆయనే ఆపిల్ మ్యాన్గా ఇండియన్స్కు సుపరిచితులు.
అమెరికాలోని ఫిలడెల్ఫియాకు చెందిన క్రిస్టియన్ కుటుంబంలో శామ్యూల్ స్టోక్స్ జన్మించారు. వారిది సంపన్న కుటుంబం. అయితే, స్టోక్స్కు చిన్ననాటినుంచి డబ్బులపై మక్కువ లేదు. దాతృత్వంవైపే ఆయన చూపు. దీంతో మిషనరీ సంస్థలో చేరారు. 22 ఏండ్ల వయస్సులో భారత్లోని సిమ్లా ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడి కుష్ఠురోగులకు సేవలందించారు. భారతీయులకు దగ్గరయ్యేందుకు తన వేషధారణ మార్చుకున్నారు. స్థానిక భాషను నేర్చుకున్నారు. ఇండియాలో పుట్టి పెరిగిన ఆంగ్లో ఇండియన్ ఆగ్నెస్ను పెళ్లాడారు. హిమాచల్లోనే భూమి కొనుక్కొని స్థిరపడ్డారు.
అమెరికాలోని లూసియానాలో పండించే యాపిల్ పండ్ల పంటకు సిమ్లా వాతావరణం సరిపోతుందని భావించారు. స్థానిక ప్రజలందరినీ యాపిల్ పండ్ల పంట వైపు ప్రోత్సహించారు. అలా ఇండియాకు యాపిల్ను పరిచయం చేసి ‘ఆపిల్మ్యాన్’గా మారిపోయారు. తనువెల్లా భారతీయతను నిం పుకున్న స్టోక్స్..గాంధీజీ మార్గంలో పయనించారు. బ్రిటిషర్లకు స్థానిక ప్రజలు వెట్టిచాకిరీ చేయొద్దని సూచించారు. ఇందుకోసం పోరాటమే చేశారు. పత్రికల్లో వ్యాసాలు కూడా రాశారు. ఆ తర్వా త ప్రభుత్వం ఈ వెట్టిచాకిరీ పద్ధతిని రద్దు చేసింది. జలియన్వాలాబాగ్ దుర్ఘటన స్టోక్స్ను కదిలించింది. 1921లో వేల్స్ చక్రవర్తి భారత్ రాకను నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. దీంతో స్టోక్స్పై బ్రిటిష్ సర్కారు రాజద్రోహం నేరం మోపింది. వాఘా వద్ద అరెస్టు చేసి, లాహోర్ జైలుకు పంపింది. స్టోక్స్ ఆరునెలల జైలు శిక్ష అనుభవించారు. జాతీయోద్యమంలో అరెస్టయిన తొలి అమెరికన్గా చరిత్రలో నిలిచిపోయారు. శామ్యూల్ స్టోక్స్ హిందూమతం స్వీకరించి సత్యానంద స్టోక్స్గా మారారు. 1946 మే 14న అనారోగ్యంతో మరణించారు.