దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. ఢిల్లీలో స్వంతత్ర భారత్ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. ఆగస్టు 14 రాత్రి 11 గంటలకు రాజ్యాంగ సభ సమావేశమైంది. దేశ ప్రజలను ఉద్దేశించి జవహర్లాల్ నెహ్రూ స్వాతంత్య్ర సందేశం వినిపించారు.
ఆ ప్రసంగం ‘ట్రైస్ట్ విత్ డెస్టినీ’గా చరిత్రకెక్కింది. ఆల్ ఇండియా రేడియో ఓవర్సీస్ విభాగం ప్రపంచ దేశాలకు ప్రసారం చేసింది. ఆల్ ఇండియా రేడియో ఓవర్సీస్ విభాగంలో టెక్నికల్ అసిస్టెంట్ బాధ్యతల్లో తెలుగువాడైన అచ్యుతరామం నెహ్రూ ప్రసంగాన్ని మొదటగా విన్నాడు. ఆ ఉద్విగ్న క్షణాల్లో అతనిలో దేశభక్తి ఉప్పొంగిపోయింది. ఒక చారిత్రక ఘట్టాన్ని ప్రసారం చేసే అవకాశం, ఒక అరుదైన సందర్భంలో జరుగుతున్న వేడుకలను చూస్తూ ఆయన మురిసిపోలేదు. నెహ్రూ ప్రసంగం తర్వాత తాజ్ హోటల్, మరికొన్ని ప్రదేశాల్లో జరుగుతున్న స్వాంతంత్య్ర ఉత్సవాలను తిలకించారు. ఆల్ ఇండియా రేడియోకి వివిధ నగరాల్లో జరుగుతున్న స్వాతంత్య్ర వేడుకల గురించి వస్తున్న వార్తలు విన్నాడు అచ్యుత రామం. రాత్రి 3 గంటలకు ఇంటికి చేరాడు.
డైరీ తీసి.. ‘నేనీ రాత్రి సంతోషంగా లేను. స్వాతంత్య్ర ఉత్సవాల్లో భాగం కాలేకపోయాను’ అని డైరీలో రాసుకున్నాడు. డైరీలోని ఆగస్టు 15వ తేదీ పేజీలో ఆనాటి భారత దేశాన్ని కళ్లకుకట్టేలా అక్షరబద్దం చేశాడు. దేశ విభజన విషాదం, మత ఘర్షణలు వింటూ ఆనందంగా గడపలేకపోయాడు. స్వాతంత్య్రం సిద్ధించినప్పుడు తూర్పు, పశ్చిమ భారత దేశంలో విభజన పర్యవసానంగా తలెత్తిన మత ఘర్షణల్లో లక్షలాది మంది ఇల్లు వాకిలీ వదిలి కట్టుబట్టలతో తరలిపోతున్నారు.మతద్వేషంతో సాటి మనుషుల్ని చంపుకుంటున్నారు. ఆ వార్తలు ఉత్సవంలో భాగం కాలేకపోయాడు. నేడు అచ్యుతరామం లేకపోయినా ఆయన డైరీ ఒక చరిత్రగా మిగిలిపోయింది!