తెల్లదొరల పాలన అంతా నల్ల మచ్చల మయమే. ఘోర దురంతాల దొంతరే. అందులో అన్నిటికన్నా కొట్టొచ్చినట్టు కనిపించేవి పంజాబ్లో జరిగిన ఘాతుకాలు. అందుకు కారకుడు లెఫ్టినెంట్ గవర్నర్ మైకేల్ ఓడ్వయ్యర్. ‘జలియన్వాలాబాగ్లో అమాయకుల ఊచకోత సరైనదే’ అని విషం కక్కిన ఆ కర్కోటకుడిని చరిత్ర ముందు దోషిగా నిలబెట్టి, ఆపై న్యాయపోరాటం చేసి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించిన తెంపరి ఒకడున్నాడు. అతడే చెట్టూరు శంకరన్ నాయర్. అతిపిన్న వయసులో కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికై చరిత్ర సృష్టించిన నాయర్.. వైస్రాయ్ కౌన్సిల్లో విద్యామంత్రిగా, మద్రాస్ హైకోర్టు న్యాయమూర్తిగా కూడా పనిచేశాడు.
జలియన్వాలాబాగ్ నరమేధాన్ని గాంధీజీతో సహా కాంగ్రెస్ నేతలందరూ తీవ్రంగా ఖండించారు. విశ్వకవి రవీంద్రనాథ్ టాగూర్ తన నైట్హుడ్ను బ్రిటిష్ పాలకుల మొఖాన కొట్టారు. వలసాధిపత్యాన్ని తెగ ప్రేమించే చర్చిల్ కూడా ‘ఆ ఘటన ఓ మచ్చే’ అని ఒప్పుకోక తప్పలేదు. ఇలా అందరూ ఆ ఘటనను ఖండించడంతో సరిపెట్టారు. కానీ ఓడ్వయ్యర్ అనే దుర్మార్గుడే ఆ ఘోరకలికి బాధ్యుడని నాయర్ నేరుగా ఆరోపణలు చేసి, ప్రకంపనలు సృష్టించాడు.
ఈ ఘటనలన్నీ జరిగింది 1919లో. గాంధీ అప్పుడప్పుడే సహాయ నిరాకరణ లాంటి వినూత్న నినాదాలతో జాతీయోద్యమంలో ప్రముఖ వ్యక్తిగా ఎదుగుతున్నారు. జాతి నాడిని పట్టుకుంటున్నారు. కానీ ఆయన విధానాలతో నాయర్ విభేదిస్తూ వచ్చాడు. జలియన్వాలాబాగ్ దురంతానికి నిరసనగా వైస్రాయ్ కౌన్సిల్కు రాజీనామా చేసి నాయర్ సంచలనం సృష్టించాడు. అంతేకాకుండా గాంధీ విధానాలను తూర్పార పడుతూ ‘గాంధీ అండ్ అనార్కిజం’ అనే పుస్తకం రాశాడు. అందులో గాంధీని విమర్శిస్తూ పనిలో పనిగా ఓడ్వయ్యర్పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డాడు.
పంజాబ్ను నరకంగా మార్చిన దుర్మార్గుడు అని ఆరోపణలు చేశాడు. ఇది చిన్న విషయం కాదు. బ్రిటిష్ పాలకులపై ఓ భారతీయుడు నేరుగా ఆరోపణలు చేయడమా? దీనిపై లండన్ ఉన్నత న్యాయస్థానంలో ఓడ్వయ్యర్ పరువునష్టం దావా వేశాడు. నాయర్ లండన్ వెళ్లి కోర్టు లోపలా, వెలుపలా తన వాదం వినిపించాడు. ‘బ్రిటిష్ ప్రజలారా మీ నుంచి వచ్చిన వలస పాలన అధికారులు చేస్తున్న దుశ్చర్యలు ఇవీ’ అని చాటిచెప్పాడు.
పత్రికలు నాయర్ మాటలను ప్రముఖంగా ప్రచురించేవి. ఏం చేస్తే ఏం? బ్రిటిష్ న్యాయస్థానంలో బ్రిటిష్ అధికారిపై కేసు గెలవడం అయ్యే పని కాదు. ఓ భారతీయునికి అప్పట్లో అది అసంభవమే. నాయర్ కూడా కేసు గెలుస్తానని ఆశించలేదు. అతడి అసలు లక్ష్యం నిరంకుశ పాలనను ఎండగట్టడమే. ఆ పని దిగ్విజయంగా పూర్తి చేశాడు. జ్యూరీ ఓడ్వయ్యర్కు అనుకూలంగా ఏకాభిప్రాయ తీర్పును ఇవ్వలేక పోయింది. అందుకు హరాల్డ్ లాస్కీ అనే రాజకీయ సిద్ధాంతకర్త, ఆర్థికవేత్త కారణం.
జ్యూరీలో ఒక్కడు తప్ప అందరూ ఓడ్వయ్యర్ వైపు నిలిచారు. అందులో సభ్యుడైన లాస్కీ ఒక్కడే వారితో విభేదించాడు. దీనిని ఆసరాగా చేసుకుని నాయర్ అప్పీలుకు వెళ్లి ఉండవచ్చు. కానీ ‘మరో 12 మంది బ్రిటిష్ దుకాణాదారుల’ నుంచి ఇంతకంటే ఎక్కువ ఏమీ ఆశించను’ అంటూ జ్యూరీని ఈసడించాడు. 7,500 బ్రిటిష్ పౌండ్ల పరిహారం ఓడ్వయ్యర్ మొఖాన కొట్టాడు. అప్పుడది చాలా పెద్దమొత్తమే. కేసు ఓడిపోయినా బ్రిటిష్ వాడి కోర్టులో భారతీయులకు న్యాయం దక్కదనే విషయాన్ని రూఢి చేయడంలో నాయర్ పెద్ద విజయమే సాధించాడు. పరువు తీసి పరిహారం చేతిలో పెట్టాడు. బ్రిటిష్ దొరలు బారిష్టర్గిరీలో నేర్పిన పాఠాలు వారికే అప్పగించాడు. బ్రిటిష్ ప్రజల్లో వలస పాలకులపై వ్యతిరేకత పెంచడంలోనూ ఈ న్యాయపోరాటం బాగా పనిచేసింది.
నాయర్ కేసుపై బాలీవుడ్ సినిమా
చెట్టూరు శంకరన్ నాయర్ ఆత్మకథను ఆయన అల్లుడు, స్వతంత్ర భారత ప్రథమ విదేశాంగ కార్యదర్శి కేపీస్ మీనన్ గ్రంథస్థం చేశాడు. అందులో ఆయన జీవిత కథనంతా నిక్షిప్తం చేశాడు. కాగా ఓడ్వయ్యర్పై నాయర్ న్యాయపోరాటాన్ని ‘ద కేస్ దట్ షుక్ ద ఎంపైర్’ (బ్రిటిష్ సామ్రాజ్యాన్ని కదిలించిన కేసు) అనే పుస్తకంలో సవివరంగా రాశారు. కోర్టులో జరిగిన వాదోపవాదాలను అందులో కళ్లకుకట్టినట్టు పేర్కొన్నారు. 2019లో వెలువడిన ఈ పుస్తకానికి నాయర్ మునిమనుమడు రఘు పళత్, అతడి భార్య పుష్పా పళత్ జంట రచయితలు. దీని ఆధారంగా సినిమా తీయనున్నట్టు ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ 2021 జూన్ 29న ప్రకటించారు.