ప్రపంచంలో ఎక్కడ ఏ ఉద్యమాలు జరిగినా అందులో ప్రసార మాధ్యమాలు కీలక పాత్రను పోషించాయి. భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో అనేక పత్రికలు ఉన్నా, అంతకంటే బృహత్తరమైన ఆయుధంగా ఇక్కడి దేశభక్తులు రేడియోను ఎన్నుకున్నారు. హైదరాబాద్లో ఏకంగా భాగ్యనగర్ రేడియో కేంద్రాన్ని స్థాపించడం ఎంతో ప్రత్యేకమైది. ప్రతి రోజూ సాయంత్రం ప్రసారాలు జరిగేవి.
నిజాంకు చెందిన ‘దక్కన్ రేడియో’ ప్రసారాలతోపాటు ప్రతి రోజూ భాగ్యనగర్ కేంద్ర ప్రసారాలు ఆరంభమయ్యేవి. తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో ప్రసారాలు చేసేవారు. ఈ నిస్తంత్రీ ప్రసారం తంతు ఎట్లా జరుగుతున్నదో చివరివరకు పరమ రహస్యంగా ఉంచారు. ఇదొక అజ్ఞాత రేడియో. చరిత్రలో అపూర్వ సంఘటన.
ఈ రేడియో కేంద్రం ఎక్కడ ఉందా? అని అప్పటి హైదరాబాద్ సర్కారు చాలా తికమకపడింది. దీని ఉనికిని కనుగొనాలని చాలా ప్రయత్నించినా వారి తరం కాలేదు. కర్నూలు శిబిర ప్రధాన నిర్వహణాధికారి పాగా పుల్లారెడ్డి ఈ ప్రసార యంత్రాన్ని బొంబాయి నుంచి తెచ్చారు. సోషలిస్టు నాయకుడు అచ్యుత పట్వర్ధన్ దానిని సమకూర్చారు.
ఈ రేడియో సెట్టును వనపర్తి రఘునాథరెడ్డి, కొదండ రామిరెడ్డి, పల్లెపాడు గోవర్దనరెడ్డి తెచ్చి అమర్చారు. హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ వారు తెలుగునేలపై దీనిని ప్రత్యక్షంగా నడిపి, సమర్థవంతంగా నిర్వహించి చూపారు. పాగా పుల్లారెడ్డి నాయకత్వంలో ఈ కేంద్రాన్ని నడిపే బాధ్యత గడియారం రామకృష్ణశర్మ, గొట్టిముక్కల కృష్ణమూర్తి వహించారు. భాగ్యనగర్ రేడియో కేంద్రం వల్ల స్టేట్ కాంగ్రెస్ ఉద్యమానికి ఊతం లభించింది. లక్షలాది మంది స్టేట్ కాంగ్రెస్ దృక్పథాన్ని, ఆశయాలను, లక్ష్యాలను బాగా తెలుసుకోగలిగారు. ప్రజల్లో ధైర్యం, మనోనిబ్బరం పెంచేందుకు ఈ రేడియో కేంద్రం ఎంతగానో ఉపకరించింది.
ఈ కేంద్రం ప్రసారాలను సంస్థానంలోపలి ప్రజలు వింటున్నారని గ్రహించిన అప్పటి సర్కారు పబ్లిక్ రేడియోలు బంద్ చేయించింది. అయినప్పటికీ ఇండ్లలో ఎవరికివారు గుట్టుచప్పుడు కాకుండా చక్కగా భాగ్యనగర్ కార్యక్రమాలు వినేవారు. స్టేట్ కాంగ్రెస్ యథార్థ ప్రచారం నిరాటంకంగా జరిగేది. దేశంలో ఇలాంటి రేడియో ప్రసారాలు అప్పటికి మరెక్కడా లేవు.
-మ్యాకం రవికుమార్