సంప్రదాయ గుజరాతీ వస్త్రధారణతో మదురై నగరంలో అడుగుపెట్టిన గాంధీజీ తెల్లవారే సరికి మారిపోయారు. ఓ పేదరైతులా దర్శనమిచ్చారు. సెప్టెంబరు 22, 1921 రాత్రి ఏం జరిగింది? గాంధీ ఎందుకు మారిపోయారు?
కరైకుడి వెళ్తూ 1921 సెప్టెంబరు 22న మదురై చేరుకున్నారు. గుజరాతీ సంప్రదాయ నిండు దుస్తులతో వెళ్లారు. ఆ రోజు పశ్చిమ మాసీ వీధిలోని ఒక గాంధేయవాది ఇంట్లో బస చేశారు. రైలు యాత్రలో దారిపొడవునా కనిపించే పేద రైతుల దుర్భర జీవితం గాంధీజీని కలిచివేసింది. అర్ధరాత్రి లేచి తన ధోతీని చింపి అంగవస్త్రంలా చుట్టుకున్నారు. గాంధీజీ హఠాత్తుగా ఇలా మారిపోవడం చూసి ఎంతోమంది ఎన్నో ప్రశ్నలు అడిగారు. వాటన్నిటికీ ఆయన చెప్పిన సమాధానం ఒక్కటే. ‘పేదలకు భిన్నమైన దుస్తులు వేసుకుంటే వారితో నన్నెలా పోల్చుకోగలను’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. మహాత్ముని ఆలోచన మార్చిన మదురై చరిత్రలో నిలిచిపోయింది. గాంధీ కొళ్లాయి కట్టిన విగ్రహాన్ని మదురైలోని కామరాజర్ రోడ్లో ఏర్పాటు చేశారు.