యుద్ధనౌక తల్వార్లో నావికులు వేసిన పొలికేక బ్రిటిష్ పాలకులకు వెన్నులో వణుకు పుట్టించింది. మెస్సులో నాసిరకం తిండి పెట్టడాన్ని వ్యతిరేకిస్తూ మొదలైన ఆందోళన దావానలంలా వ్యాపించింది. స్వాతంత్య్ర పోరాటంలో సాయుధ దళాలు దిగితే ఇంకేమన్నా ఉందా? అప్పటిదాకా మహజర్లు పట్టుకుని వచ్చేవాళ్లను, వీధుల్లో శాంతియుత ప్రదర్శనలు చేసేవారిని ఉక్కుపాదంతో అణిచివేశారు. కానీ, యూనిఫారాలు తుపాకులు ఎక్కుపెడితే పుట్టగతులుంటాయా?
17.02.1946
రెండో ప్రపంచ యుద్ధంలో విజేతగా నిలిచిన బ్రిటిష్ పాలకులకు ఆ విజయం తెచ్చి పెట్టింది ఏమీ లేదు. తీవ్ర విధ్వంసం పాలై మూలుగుతున్నా ఇంకా వలసలను పట్టుకుని వేలాడుతూనే ఉంది. సరిగ్గా ఆ సమయంలో బ్రిటిష్ యుద్ధనౌక తల్వార్లో కుళ్లిపోయిన తిండి పెడుతున్నారంటూ భారత నావికులు ఫిబ్రవరి 17న ఫిర్యాదు చేశారు. ‘బిచ్చగాళ్లకు రుచులు కూడానా’ అంటూ బ్రిటిష్ అధికారులు ఈసడించారు. ఆ మరుసటి రోజు ఫిబ్రవరి 18న 1,500 మంది భారతీయ నావికులు మెస్ను బహిష్కరించి.. ఈ బిచ్చపు తిండి మాకొద్దంటూ నిరసనగా బయటకు వచ్చారు. భారత స్వాతంత్య్రోద్యమంలో అదొక కీలక మలుపు. భారతీయులకు అవి ఉద్విగ్న క్షణాలు. ఆ రాత్రి ఆలిండియా రేడియో, బీబీసీ నావికుల తిరుగుబాటు వార్తను ప్రసారం చేశాయి. తిండి సరిగా లేదన్న చిన్న అంశం మీద మొదలైన ఆందోళన.. సైనిక తిరుగుబాటుగా పరిణమించింది.
పోరుజెండా ఎగరేసిన నావికులు..
ఆ మరుసటి రోజు అంటే ఫిబ్రవరి 19న నావికాదళ సమ్మె కమిటీ ఎన్నికైంది. ఆ కమిటీ నాయకత్వంలో రాయల్ ఇండియన్ నేవీకి చెందిన 60 నౌకలు, 11 తీరప్రాంత కార్యాలయాలకు తిరుగుబాటు పాకింది. వాటన్నింటిపై ఆందోళనకారులు బ్రిటిష్ జెండా పీకి పారేసి భారత స్వాతంత్య్రం కోసం పోరాడుతున్న పార్టీల పతాకాలను ఎగరేశారు. ఇంతింతై అన్నట్టుగా తిరుగుబాటు విస్తరించింది. యుద్ధనౌక తల్వార్ ఈ తిరుగుబాటుకు కేంద్రమైంది. 80 నౌకలు, నాలుగు నౌకా సమూహాలు, 20 తీరప్రాంత కార్యాలయాలపై స్వదేశీ జెండాలు ఎగరేశారు. తిరుగుబాటు చేసిన నావికుల సంఖ్య 20,000కు చేరుకున్నది. వైమానిక దళం, పోలీసు దళాల్లోని అనేకమంది సమ్మెలో చేరిపోయారు. వేల సంఖ్యలో తిరుగుబాటుదారులు ఊరేగింపుగా వెళ్లి రేవులో లంగరేసిన తల్వార్ దగ్గర గుమిగూడారు. భారతీయ ప్రజల్లో ఈ సమ్మెకు కొంత మద్దతు లభించింది. బాంబేలో తిరుగుబాటుకు మద్దతుగా కార్మికులు ఒకరోజు సమ్మె చేయడం విశేషం.
“మన జాతి జీవితంలో ఈ సమ్మె ఓ చరిత్రాత్మక ఘటన. ఈ రోజు సైనికుల రక్తం, సామాన్యుల రక్తం ఒక ఉమ్మడి లక్ష్యం కోసం కలిసి పారింది. సైనిక సేవలో ఉన్న మేము దీనిని ఎప్పుడూ మరచిపోము. మా సోదరులు, సోదరీమణులైన మీరూ దీనిని ఎప్పుడూ మరచిపోరని భావిస్తున్నాము. మనదేశ మహాప్రజలు జిందాబాద్. జైహింద్” అని సమ్మె కమిటీ ఫిబ్రవరి 22న విడుదల చేసిన చివరి ప్రకటనలో పేర్కొన్నది.
అధికారులకు ఎడమ చేత్తో సెల్యూట్
రాజకీయ పార్టీలు సాయుధ దళాల్లో బ్రిటిష్ పాలకులపై చెలరేగిన ఆగ్రహావేశాలపై భిన్నంగా స్పందించాయి. నౌకాదళ తిరుగుబాటుదారులు కాంగ్రెస్, ముస్లిం లీగ్తో పాటుగా కమ్యూనిస్టు జెండాలను ఎగరేశారు. అయినప్పటికీ నావికుల సమ్మెను ఇటు కాంగ్రెస్, అటు ముస్లిం లీగ్ సమర్థించకపోగా వ్యతిరేకించాయి. కమ్యూనిస్టులు మాత్రం సమర్థించారు. సమ్మెలో పాల్గొన్న సాయుధ దళాల సభ్యులు బ్రిటిష్ అధికారుల కు కుడి చేతికి బదులుగా ఎడమ చేతితో సెల్యూట్ చేశారు. తమను తాము భారత జా తీయ నౌకాదళంగా ప్రకటించుకొన్నారు. దేశవ్యాప్తంగా అనేక సైనిక శిబిరాల్లోనూ అసమ్మతి భగ్గుమన్నది. కరాచీ నుంచి కలకత్తా దాకా సాయుధ శిబిరాల్లో అల్లర్లు మొదలయ్యాయి. బ్రిటిష్ సర్కారు దిక్కు తోచని స్థితిలో పడింది.
ఆ దశలో కాంగ్రెస్ నాయకులు సమ్మె విరమించాల్సిందిగా నావికులకు విజ్ఞప్తి చేశారు. జిన్నా కూడా అదే సలహా ఇచ్చారు. పరిస్థితి చేయిదాటిపోతున్నట్టు సూచనలు కనిపించడంతో చివరకు సర్దార్ పటేల్ను కాంగ్రెస్ రంగంలోకి దింపింది. ఆయన వెళ్లి నౌకాదళ సమ్మె కేంద్ర కమిటీ అధ్యక్షుడు ఎంఎస్ ఖాన్ను సమ్మె విరమణకు ఒప్పించారు. సమ్మెలో పాల్గొన్న సాయుధదళాల సభ్యులను వేధించవద్దనే షరతుతో నావికులు సమ్మె విరమించారు. అప్పుడు బ్రిటిష్ అధికారులు రంగంలోకి దిగి వందలాది మంది నావికులను అరెస్టు చేసి జైళ్లలో తోశారు. సైనిక విచారణ జరిపి 476 మంది నౌకాదళ జవాన్లను ఉద్యోగం నుంచి తొలగించారు. తర్వాతి కాలంలో ఇటు ఇండియా కానీ, అటు పాకిస్థాన్ కానీ ఆ నావికులను తిరిగి విధుల్లో చేర్చుకోలేదు. ఆ విధంగా ఆ యువకిశోరాలు తమ భవిష్యత్తును బలివేదికపై పెట్టి భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడారు.