హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్న స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం రాష్ట్రవ్యాప్తంగా వన మహోత్సవ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 141 మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థల్లో 159 ఫ్రీడం పార్కులను ఏర్పాటు చేయనున్నారు. వీటిల్లో 72,130 మొక్కలు నాటనున్నారు. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 17 ఫ్రీడం పార్కులను ఏర్పాటుచేస్తున్నారు. మేడ్చల్ మల్కాజిగిరిలో 14, నిజామాబాద్ జిల్లాలో 10 ఫ్రీడం పార్కులు ఏర్పాటు చేయనున్నారు.
వరంగల్ నగర పాలక సంస్థ, జమ్మికుంటలో 7,500 చొప్పున మొక్కలు నాటనున్నారు. వజ్రోత్సవాల గుర్తుగా నాటే మొక్కల సంఖ్య 75, 750, 7,500.. ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, నగర పాలక సంస్థలకు ఉన్నతాధికారులు సూచించారు. అదేవిధంగా 75 ఆకారం వచ్చే విధంగా కూడా మొక్కలు నాటాలని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మంగళవారం ఇంటింటికీ జాతీయ జెండాల పంపిణీ కార్యక్రమం మొదలైంది. విద్యార్థులకు థియేటర్లలో గాంధీ సినిమా ప్రదర్శనలు ప్రారంభమయ్యాయి.
159 ఫ్రీడం పార్కుల ఏర్పాటు
72,130 ఫ్రీడం పార్కుల్లో నాటనున్న మొక్కలు
75 ఆకారం వచ్చే విధంగా మొక్కలు
అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 17 ఫ్రీడం పార్కుల ఏర్పాటు