‘ఈ విశ్వమంతా నాదే. ఈ ప్రపంచమంతా నా కుటుంబంగా భావిస్తాను’ అంటూ ‘విద్వతీ సన్యాసం’ తీసుకున్న తర్వాత వెంకట్రావ్ ఖేడ్గీకర్ ‘స్వామి రామానంద తీర్థ’ నామం స్వీకరించారు. తను సన్యాసం స్వీకరించినది తపస్సు చేసుకునేందుకు కాదు. దారిద్య్రం, అజ్ఞానం, జడత్వం, బానిసత్వం రూపుమాపేందుకు. రామానంద తీర్థ అశేష ప్రజలకు సేవచేసేందుకు తపించిన నిష్కామ కర్మ యోగి.
స్వామీజీ పూర్వ హైదరాబాద్ సంస్థానంలోని గుల్బర్గా జిల్లా జావర్గీ తాలూకా సిందీ గ్రామంలో 1903, అక్టోబరు 3న జన్మించారు. తిలక్ ప్రసంగాలు విని.. గాంధీజీ మార్గంలో నడుస్తూ స్వరాజ్య సాధనకోసం శ్రమించారు. లాతూరులో 1938 జూన్లో జరిగిన మహారాష్ర్ట రెండో మహాసభలో స్వామీజీ పాల్గొన్నారు. అనంతరం హైదాబాద్ రావడంతో తన రాజకీయ ప్రస్థానం మొదలైంది. అఖిల భారత కాంగ్రెస్ మహాసభలకు హాజరవుతూ గాంధీజీ సిద్ధాంతాలపట్ల విశ్వాసం గల వందలాది మంది యువ కార్యకర్తలను సమీకరించారు. వారి సహకారంతో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ నిర్మాణానికి పునాది వేశారు. ‘హైదరాబాద్ సంస్థానంలో రాజకీయ కార్యకలాపాలు కొనసాగించడం నిషిద్ధం. అలాంటి ప్రయత్నాలు విరమించుకుంటే క్షేమం’ అని నాటి ప్రధానమంత్రి సర్ అక్బర్ హైదరీ హెచ్చరించినా స్వామీజీ ఆలోచనలో మార్పు రాలేదు.
హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ ఏర్పాటు చేయాలని స్వామిజీ ప్రయత్నించారు. శాంతి భద్రతల పరిరక్షణ కోసం స్టేట్ కాంగ్రెస్ను నిషేధిస్తున్నట్టు ప్రభుత్వం ఫర్మానా జారీ చేసింది. ఆ ఉత్తర్వులను ధిక్కరించాలని స్వామీజీ పిలుపునిచ్చారు. సుల్తాన్ బజార్లోని హైదాబాద్ టెలిగ్రాఫ్ కార్యాలయానికి దగ్గరలో హైదరాబాద్ స్టేట్ కాంగ్రెస్ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరించినందుకు స్వామీజీతోపాటు రావి నారాయణరెడ్డి, తదితరులను అరెస్టు చేసి, చంచల్గూడ జైలులో నిర్భంధించారు. న్యాయస్థానం 18 నెలల శిక్ష విధించింది.
జాతీయోద్యమం, స్టేట్ కాంగ్రెస్ ప్రభావం వల్ల నాటి విద్యార్థి యువత దేశభక్తితో వందేమాతర గీతం ఆలపించినందుకు బహిష్కరణకు గురయ్యారు. వందేమాతర ఆలాపనను నిషేధించినా ధిక్కరించారు. ఉస్మానియాలో మూడు వందలమందికిపైగా విద్యార్థులను బహిష్కరించారు. ఆనాటి బహిష్కృతుల్లో మాజీ ప్రధాని పీవీ ఒకరు.
1952 సార్వత్రిక ఎన్నికల్లో గుల్బర్గా నియోజక వర్గం నుంచి స్వామీజీ గెలుపొందారు. ఆ తర్వాత.. రాజకీయాల నుంచి నిష్ర్కమించి సంఘ సంస్కరణ వైపు అడుగులు వేశారు. పేద ప్రజల సుఖ సంతోషాలు, దారిద్య్ర నిర్మూలన కోసం జీవితాంతం కృషి చేశారు. 1972 జనవరి 22న కన్నుమూశారు.
మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు స్వామీ రామానంద తీర్థ రాజకీయ గురువు. స్వామీజీ మరణించినప్పుడు తన అనుంగు శిష్యుడు అయిన పీవీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.. గురువు స్మారకార్థం 1973లో ‘స్వామి రామానంద తీర్థ మెమోరియల్’ స్థాపించి స్వామీజీ భావాలను, ఆదర్శాలను ప్రచారంలోకి తీసుకువచ్చారు. జాతీయ భావాలవైపు యువతను నడిపించిన స్వామీజీ ఎందరికో మార్గదర్శి.
-సురభి వాణీదేవి, ఎమ్మెల్సీ