హైదరాబాద్, జూన్ 30 (నమస్తే తెలంగాణ): రాజీవ్ స్వగృహ ఆధ్వర్యంలో హైదరాబాద్లోని పోచారం, బండ్లగూడలో నిర్మించిన ఫ్లాట్ల వేలానికి లాటరీ విజయవంతంగా పూర్తయ్యింది. ఎంపికైన వారి వివరాలను హెచ్ఎండీఏ వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. ఎంపికైన వారు ఫ్లాట్ మొత్తం విలువలో 10 శాతం టోకెట్ అడ్వాన్స్గా వారం రోజుల్లో చెల్లించాలని, అలా చెల్లించిన వారికే అలాట్మెంట్ లెటర్ ఇస్తామని రాజీవ్ స్వగృహ అధికారులు చెప్తున్నారు. ఆ లెటర్ ఇచ్చిన తేదీ నుంచి 60 రోజుల్లో తొలి ఇన్స్టాల్మెంట్గా సేల్ వ్యాల్యూలో 80 శాతం చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. అలాట్మెంట్ లెటర్తో బ్యాంక్లోన్కు దరఖాస్తు చేసుకొనే ఆప్షన్ కూడా ఇచ్చామని, బండ్లగూడ, పోచారంలో వివిధ బ్యాంకులు కౌంటర్లు సైతం ఏర్పాటు చేస్తాయని చెప్పారు. 80 శాతం చెల్లింపు పూర్తయిన 30 రోజుల్లో మిగిలిన 10 శాతం చెల్లించాలని స్పష్టం చేశారు. నిర్దేశిత గడువులోపు చెల్లింపులు చేయడంతో విఫలమైనవారు టోకెన్ అడ్వాన్స్ను కోల్పోతారని చెప్తున్నారు.
ఆందోళన చెందొద్దు..
రాజీవ్ స్వగృహ ఫ్లాట్లలో ఇబ్బందులు ఉన్నాయని వస్తున్న వార్తలతో ఎవరూ ఆందోళన చెందొద్దని అధికారులు సూచించారు. చాలారోజులుగా నిరుపయోగంగా ఉన్నందుకు ప్లంబింగ్, వైరింగ్ సమస్యలు రావొచ్చని, ముందే వాటిని సరిచేసుకొంటే తరువాత ఎలాంటి ఇబ్బందులు ఉండవని తెలిపారు. ఎంపికైనవారితో సొసైటీలను ఏర్పాటు చేస్తామని, టవర్లవారీగా ప్లంబింగ్, వైరింగ్, నిర్వహణ బాధ్యతలు ఆ కమిటీలే చూసుకొంటాయని పేర్కొన్నారు.