హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ): బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్లో ఏపీ సర్కారుకు చుక్కెదురైంది. కృష్ణా జలాల పంపిణీ విచారణ అంశాలపై ఎస్వోసీ (స్టేట్మెంట్ ఆఫ్ కేస్) దాఖలు కోసం జూన్ నెలాఖరు వరకు గడువు ఇవ్వాలన్న ఏపీ విజ్ఞప్తిని ట్రిబ్యునల్ తిరస్కరించింది. రెం డు వారాల్లోగా ఎస్వోసీని దాఖలు చేయాలని ఆదేశించింది. కృష్ణా జలాల్లో ఉమ్మడి ఏపీకి కేటాయించిన 1,005 టీఎంసీలతోపాటు గోదావరి డైవర్షన్ ద్వారా వచ్చే 45 టీఎంసీలను తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మ ధ్య పునఃపంపిణీ చేసేందుకు అంతర్రాష్ట్ర జల వివాదాల చట్టం-1956లోని సెక్షన్ 3 ప్రకారం విచారణ జరపాలని, ప్రాజెక్టు లవారీగా రెండు రాష్ర్టాలకు నీటిని కేటాయించాలని కేంద్రం నిరుడు అక్టోబర్లో నూతన మార్గదర్శకాలను జారీ చేసింది. ఆ విచారణకు సంబంధించి తెలంగాణ ఇప్పటికే ఎస్వోసీని సమర్పించింది. ఏపీ సమర్పించలేదు. దీనిపై సోమవారం ఢిల్లీ లో బ్రిజేశ్కుమార్ ట్రిబ్యునల్ విచారణ చేపట్టింది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఎస్వోసీని సమర్పించలేకపోతున్నామని, జూ న్ నెలాఖరు వరకు గడువు ఇవ్వాలని ఏపీ తరపున సీనియర్ అడ్వకేట్ జయదీప్గు ప్తా అభ్యర్థించారు. తిరస్కరించిన జస్టిస్ బ్రిజేశ్కుమార్.. ఈ నెల 28లోగా ఎస్వోసీ దాఖలు చేయాలని ఆదేశించారు. రెండు రాష్ట్రాలు కౌంటర్లు సమర్పించాలని పేర్కొంటూ.. విచారణను మే 15, 16, 17 తేదీలకు వాయిదా వేశారు.