Kadiyam Srihari | హైదరాబాద్, మార్చి 30(నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ వైపు మొగ్గుచూపిన ఎమ్మెల్యే కడియం శ్రీహరికి గానీ, ఆయన కూతురు కావ్యకు గానీ వరంగల్ లోక్సభ సీటు ఇచ్చే విషయంపై ఆ పార్టీలోనే సందిగ్ధత నెలకొన్నది. తన కుమార్తెకు టికెట్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిందంటూ కడియం చెప్తున్నప్పటికీ ఢిల్లీలో అందుకు భిన్నంగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వరంగల్ సీటు మాదిగ సామాజిక వర్గ నేతకే ఇస్తామని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ పలువురు మాదిగ నేతలకు హామీ ఇచ్చినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
కడియం కుటుంబానికి టికెట్ ఇవ్వబోమని స్పష్టం చేసినట్టు విశ్వనీయవర్గాల సమాచారం. ఈ పరిణామం వెనుకు ఢిల్లీలో పెద్ద తతంగమే జరిగినట్టు తెలిసింది. ఈ లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో కాంగ్రెస్ నుంచి మాదిగలకు ఒక్క టికెట్ కూడా ఇవ్వడం లేదంటూ రెండు, మూడు రోజులుగా పలువురు మాదిగ సామాజికవర్గ నేతలు ఢిల్లీలో ఆ పార్టీ పెద్దలను కలుస్తున్నారు. ఈ విషయం తెలిసిన సోనియాగాంధీ వారిని పిలిపించుకోగా, అదే విషయాన్ని వారు ఆమె దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిసింది. రాష్ట్రంలోని మూడు ఎస్సీ స్థానాల్లో ఇప్పటికే నాగర్కర్నూల్, పెద్దపల్లి టికెట్లను మాల సామాజిక వర్గానికే కేటాయించారని, వరంగల్ స్థానాన్ని మాదిగలకు ఇవ్వకుండా కుట్ర చేస్తున్నారని ఆమెకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. దీంతో వరంగల్ టికెట్ మాదిగ నేతకే ఇస్తామని సోనియా వారికి హామీ ఇచ్చారని సమాచారం. దీంతో శ్రీహరి, కావ్య భవితవ్యం ప్రశ్నార్థకం కానున్నది.